హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ రంజీ టీమ్ మరో ఓటమికి దగ్గరలో ఉన్నది. ఢిల్లీతో జరుగుతున్న గ్రూపు-బి రంజీ మ్యాచ్లో హైదరాబాద్ కష్టాల్లో పడింది. హర్షిత్ రానా(4/27) ధాటికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్లో 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. సెంచరీ హీరో రోహిత్ రాయుడు(32) మినహా మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. చేతిలో ఐదు వికెట్లు ఉన్న హైదరాబాద్ ప్రస్తుతం 12 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 223/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ 433 స్కోరుకు ఆలౌటైంది. ఆయూశ్ బదోనీ(191) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. అనికేత్రెడ్డి(5/143), అజయ్దేవ్(4/87) రాణించారు.