హైదరాబాద్ : గోల్ఫ్ హబ్గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్కి అద్దం పట్టేలా గోల్ఫ్ క్లబ్ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ స్థాయిలో గోల్ఫ్ టోర్నమెంట్లను హైదరాబాద్ వేదికగా నిర్వహించబోతున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ -2022 ముగింపు కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని విన్నర్లకు, రన్నర్లకు ట్రోఫీలు, ప్రైజ్ మనీ అందించారు. ఈ టోర్నమెంట్లో 121 ప్రొఫెషనల్ గోల్ఫర్స్, 5 అమ్మెచ్యూర్ గోల్ఫర్స్ , ఇండియా, అమెరికా, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లోని ప్రముఖ అంతర్జాతీయ గోల్ఫర్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చారిత్రక గోల్కొండ కోటకు అనుబంధంగా ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందించిన హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ను అభివృద్ధి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ను పెంచేవిధంగా హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సుమారు 6 వేల గ్రామాల్లో గ్రామీణ క్రీడ ప్రాంగణాలను నిర్మించామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా మైదానాలు నిర్మించామన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి క్రీడాకారులకు ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్య కోసం 0.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
గోల్ఫ్ కోర్ట్ అభివృద్ధికి జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీలతో సమావేశం నిర్వహించి గోల్ఫ్ కోర్ట్ సమస్యలను పరిష్కరిస్తామని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. హైదరాబాద్ గోల్డ్ క్లబ్ పేద, మధ్యతరగతి గోల్ఫ్ క్రీడాకారులకు చేయూత నివ్వాలని మంత్రి సూచించారు. తెలంగాణ గోల్కొండ గోల్ఫ్ టోర్నమెంట్ అంతర్జాతీయంగా ఎంతో పేరు ఉందన్నారు. ప్రొఫెషనల్ గోల్డ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ టూరిజం, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ గోల్కొండ గోల్ఫ్ టోర్నమెంట్ ఈనెల 9 నుండి 12 వరకు జరిగిందన్నారు. రూ. 40 లక్షల ప్రైజ్ మనీతో ఈ టోర్నమెంట్ ను ఘనంగా నిర్వహించమన్నారు.
తెలంగాణ రాష్ట్రం పర్యాటకంగా, క్రీడా రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించి దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇటీవల వరల్డ్ టూరిజం దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ‘బెస్ట్ టూరిజం ఫ్రెండ్లీ గోల్ఫ్ కోర్స్’ నేషనల్ అవార్డు అందుకుందన్నారు.
ఈ సందర్భంగా గోల్ఫ్ టోర్నమెంట్ లో ఢిల్లీకి చెందిన మను గందాస్ మొదటి స్థానం సాధించినందుకు రూ. 6 లక్షల ప్రైజ్ మనీ, రెండవ స్థానంలో నిలిచిన చండీగడ్కు చెందిన యువరాజ్ సింగ్ సంద్కు రూ. 4 లక్షల ప్రైజ్ మనీని మంత్రి అందించారు. అలాగే, ఈ టోర్నీలో పాల్గొన్న గోల్ఫ్ క్రీడాకారులకు, నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ గోల్ఫ్ ఆఫ్ ఇండియా సీఈవో ఉత్తమ్ సింగ్ మండి, హైదరాబాద్ గోల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయంత్ ఠాగూర్తో పాటు పలువురు పాల్గొన్నారు.