హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అక్రమాలపై, ఈడీ విచారణ కొనసాగుతున్నది. హెచ్సీఏలో జరిగిన రూ.20 కోట్ల నిధుల స్వాహాపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది. ఈ అక్రమాలపై ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఆర్షద్ ఆయూబ్, శివలాల్ యాదవ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ (ఈడీ) అధికారులు రెండు రోజుల పాటు విచారించి.. హెచ్సీఏ మాజీ అధ్యక్షులు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్కు నోటీసులు జారీ చేశారు.
జనవరి మొదటి వారంలో ఈడీ ఎదుట హాజరుకావాలని వినోద్కు నోటీసులు పంపారు. కాగా ఉప్పల్ స్టేడియం మరమ్మతుల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి నిధులు స్వాహా చేశారని, అవినీతి నిరోధక శాఖ మూడు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ చట్టం కింద మరో కేసును నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇదే వ్యవహారంలో నవంబర్లో తెలంగాణ వ్యాప్తంగా 9 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు, రూ.10,39,000ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాణిజ్య అవసరాలకు ఉప్పల్ స్టేడియంలో నిర్మాణాలు చేపట్టొద్దని ప్రభుత్వం ఒప్పందంలో పేరొన్నా.. దాన్ని ఉల్లంఘించారని, వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా స్టాండ్ల నిర్మాణాలు జరిగాయని ఏసీబీ తెలిపింది.