గత ఐపీఎల్ ఫైనలిస్ట్ల మధ్య జరిగిన సమరంలో రాజస్థాన్దే పైచేయి అయింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్తో గుజరాత్ను కట్టడి చేసిన రాయల్స్.. ఆనక సంజూ శాంసన్, హెట్మైర్ చెలరేగడంతో హ్యాట్రిక్ విజయం ఖాతాలో వేసుకుంది.
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జోరు కొనసాగుతున్నది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న రాయల్స్ వరుసగా మూడో విజయం ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్ట పరుచుకుంది. ఆదివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్లో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (45), మిల్లర్ (46) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 179 రన్స్ చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ (32 బంతుల్లో 60; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), హెట్మైర్ (26 బంతుల్లో 56 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో రాజస్థాన్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే విజయబావుట ఎగరేసింది. ధ్రువ్ జురేల్ (18; 2 ఫోర్లు, ఒక సిక్సర్), రవిచంద్రన్ అశ్విన్ (3 బంతుల్లో 10; ఒక ఫోర్, ఒక సిక్సర్) ఆఖర్లో విలువైన పరుగులు జోడించారు. గుజరాత్ బౌలర్లలో షమీ 3, రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టారు. హెట్మైర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా సోమవారం చెన్నైతో బెంగళూరు తలపడనుంది.
గుజరాత్: 177/7 (మిల్లర్ 46, గిల్ 45; సందీప్ 2/25, జంపా 1/32), రాజస్థాన్: 19.2 ఓవర్లలో 179/7 (శాంసన్ 60, హెట్మైర్ 56 నాటౌట్; షమీ 3/25, రషీద్ 2/46).