Heartbreaking Moments : క్రీడల్లో గొప్ప సంతృప్తినిచ్చే, కలకాలం నిలిచిపోయే రికార్డులే కాదు.. గుండెల్ని పిండేసే బాధలు, భావోద్వేగాలు కూడా ఉంటాయి. అలాంటి కొన్ని సంఘటనలు చరిత్రపుటల్లో నిలిచిపోతాయి. ఇందుకు క్రికెట్(Cricket) మినహాయింపు కాదు. ప్రస్తుతం గొప్పగొప్ప ఆటగాళ్లు పుట్టుకొస్తున్నారు. తమ సంచలన ప్రదర్శనతో అభిమానులను అలరిస్తున్నారు. అయితే.. ఆటగాళ్ల జీవితంలో కొన్ని సంఘటనలు మధురానుభూతులుగా మిగిలితే.. మరికొన్ని బాధకరమైనవిగా ఎప్పుడూ మనసును తొలుస్తుంటాయి. భావోద్వేగాలను నియంత్రించుకోలేక కొందరు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకుంటే, మరికొందరు డ్రెస్సింగ్ రూమ్(Dressing Room)లో రోదించిన ఘటనలు ఉన్నాయి. తమ అభిమాన క్రికెటర్లతో పాటు ప్రపంచం కూడా కన్నీరు పెట్టుకున్న సందర్భాలు అనేకం. మనసును కదిలించే ఇలాంటి కొన్ని ఘటనలు ఇవి.
దిగ్గజ క్రికెటర్లు ఎవరైనా రిటైర్మెంట్ అవుతున్నప్పుడు అభిమానుల కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుంటాయి. రెండు దశాబ్దాల పాటు అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్(sachin tendulkar) వీడ్కోలు దేశం మొత్తాన్ని కదిలించింది. మాస్టర్ బ్లాస్టర్ కళ్ల నిండా నీళ్లతో మైదానం వీడుతూ.. చివరిసారి చేతులతో గ్రౌండ్ను తాకినప్పుడు దేశం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. సచిన్ 2013 నవంబర్ 16న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
చివరిసారి చేతులతో గ్రౌండ్ను తాకిన సచిన్
కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) ఎంత ప్రశాంతంగా ఉంటాడో తెలిసిందే. మైదానంలో భావోద్వేగాలను అద్భుతంగా నియంత్రించుకుంటాడని పేరుకున్న అతను కూడా ఓసారి కన్నీళ్లు పెట్టుకున్నాడన్న సంగతి మీకు తెలుసా?.
కన్నీళ్లు పెట్టుకున్న ధోనీ
2015 ప్రపంచకప్(2015 World Cup) సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం ధోనీ కంటతడి పెట్టుకున్నాడు. టోర్నీ నుంచి నిష్క్రమించిన బాధతో వలవలా ఏడ్చేశాడు.
1986 ఆస్ట్రల్-ఆసియాకప్లో టీమిండియా అనూహ్యంగా ఓడిపోయింది. చేతన్శర్మ(Chetan Sharma) పేలవ బౌలింగ్ భారత్కు కప్ను దూరం చేసింది. షార్జాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాక్ విజయానికి చివరి బంతికి నాలుగు పరుగులు కావాలి. చేతన్ శర్మ ఆఖరి బంతిని వేస్తున్నప్పుడు దేశం మొత్తం టీవీలకు అతుక్కుపోయింది.
చేతన్శర్మ, జావెద్ మియాందాద్
కానీ, ఫుల్టాస్ను జావెద్ మియాందాద్(Javed Miandad) బలంగా బాదాడు. అంతే.. అది స్టాండ్స్లోకి వెళ్లిపోయింది. ఆ క్షణం అభిమానుల కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. సంచలన విజయంతో పాకిస్థాన్ కప్పును ఎగరేసుకుపోయింది.
క్రికెట్లో దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచే జట్టు ఏదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికా(South Africa) మాత్రమే. గొప్ప ఆటగాళ్లతో కూడిన శక్తిమంతమైన జట్టుగా పేరొందిన అలాంటి జట్టు టోర్నీ ఏదైనా విజయాలతో అదరగొట్టేది. చివరి వరకు దూసుకొచ్చి ఒక్క ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించేది. 1999 ప్రపంచకప్(1999 World Cup) సెమీఫైనల్స్లోనూ అదే జరిగింది. సౌతాఫ్రికా విజయానికి చివరి మూడు బంతుల్లో ఒకే ఒక్క పరుగు అవసరం.
దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా
అయితే, అప్పటికే 9 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. డామియెన్ ఫ్లెమింగ్ వేసిన బంతిని ఆడిన క్లుసెనర్ పరుగు తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అలన్ డొనాల్డ్ రనౌట్ అయ్యాడు. మ్యాచ్ టైగా ముగిసింది. అయితే, సూపర్ సిక్స్ టేబుల్లో ఆస్ట్రేలియా మెరుగైన స్థానంలో ఉండడంతో ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఆ క్షణం సౌతాఫ్రికా అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
క్రికెట్ లెజెండ్ సర్ డాన్ బ్రాడ్మన్ తన చివరి ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాది. అది చూసి అభిమానులు తట్టుకోలేకపోయారు. ఆ ఒక్క మ్యాచ్లో కనీసం నాలుగు పరుగులు చేసి ఉంటే బ్రాడ్మన్ సగటు టెస్టుల్లో 100గా ఉండేది. డకౌట్ కావడంతో అది 99.94గా మిగిలిపోయింది. అయితే, ఇప్పటికీ అదే అత్యధిక బ్యాటింగ్ సగటుగా క్రికెట్ రికార్డుల్లో భద్రంగా ఉంది.
1999 ప్రపంచకప్లో ఎదురైన అనుభవమే 2015 ప్రపంచకప్లోనూ సఫారీ జట్టుకు ఎదురైంది. ఈసారి వరుణుడి రూపంలో దురదృష్టం వెంటాడింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో న్యూజిలాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జేపీ డుమిని క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన గ్రాంట్ ఇలియట్ ఆ తర్వాత దుమ్మురేపాడు.73 బంతుల్లో 84 పరుగులు చేశాడు. మరో బంతి మిగిలి ఉండగా సిక్సర్ కొట్టి మ్యాచ్ను ముగించాడు. దీంతో సౌతాఫ్రికా ప్రపంచకప్ ప్రస్థానం ముగిసింది. మరోసారి దురదృష్టం వెంటాడడతో సఫారీ ఆటగాళ్లు కన్నీళ్లతో మైదానాన్ని వీడారు.
ఆస్ట్రేలియా స్పీడ్స్టర్ బ్రెట్ లీ(Brett Lee) 2005లో జరిగిన యాషెస్ సిరీస్లో ఏడ్చేశాడు. రెండో టెస్ట్ మ్యాచ్ అతడికి కన్నీళ్లు మిగిల్చింది. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం అంచున నిలిచింది. అప్పటికి బ్రెట్ లీ, మిఖాయెల్ కాస్ప్రోవిచ్ క్రీజులో ఉన్నారు.
బ్రెట్ లీని ఓదార్చుతున్న ఫ్లింటాఫ్
ఈ క్రమంలో కాస్ప్రోవిచ్ వివాదాస్పద అంపైరింగ్కు బలయ్యాడు. దీంతో, ఇంగ్లండ్ రెండంటే రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓటమిని తట్టుకోలేకపోయిన బ్రెట్లీ కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయాడు. అతడిని ఇంగ్లండ్ స్టార్ ఫ్లింటాఫ్ ఓదార్చాడు.
1996 ప్రపంచకప్లో శ్రీలంకతో జరిగిన సెమీస్లో భారత జట్టు గెలుస్తుందని అనుకున్నారంతా. అయితే.. తొలుత విజయం దిశగా పయనించి, ఆ తర్వాత దారుణంగా ఓడింది. 251 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఒక దశలో వికెట్ నష్టానికి 98 పరుగులు చేసి విజయం దిశగా సాగింది.
శ్రీలంక చేతిలో దారుణంగా ఓడిన భారత్
అయితే, ఆ తర్వాత 22 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో భారత అభిమానులు ఆగ్రహం పట్టలేక నానా హంగామా సృష్టించడంతో మ్యాచ్ నిలిచిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ రిఫరీ క్లైవ్ లాయిడ్ శ్రీలంకను విజేతగా ప్రకటించారు. దీంతో భారత ఆటగాడు వినోద్ కాంబ్లీ ఏడుస్తూ పిచ్ను వీడాడు.
ఇంగ్లండ్ జట్టు రైజింగ్ స్టార్లలో క్రెయిగ్ కీస్వెట్టర్(craig kieswetter) ఒకడు. 2010 టీ20 ప్రపంచకప్ గెలిచినట్టు జట్టులో సభ్యుడైన అతను బాధాకరమైన రీతిలో క్రికెట్కు దూరమయ్యాడు. కౌంటీమ్యాచ్ ఆడుతుండగా బంతి బలంగా తాకడంతో కీస్వెట్టర్ కన్ను, ముక్కుకు బలమైన గాయమైంది.
చికిత్స కోసం అతను సుదీర్ఘకాలం పాటు ఆసుపత్రికే పరిమితం కావాల్సి వచ్చింది. దాంతో కీస్వెట్టర్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేకపోయాడు.
దక్షిణాఫ్రికాను గుర్తుకొస్తే దురదృష్టం మొత్తం ఆ జట్టు చుట్టూనే తిరుగుతుందా..! అనిపిస్తుంటుంది. 1992 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన సెమీస్లో సౌతాఫ్రికా విజయానికి 13 బంతుల్లో 22 పరుగులు అవసరం. జోరుమీదున్న సఫారీ టీమ్కు అది పెద్ద లెక్క కాదు. కానీ, ఎప్పటిలానే వాళ్లను దురదృష్టం వెంటాడింది. వర్షం పడడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది.
డక్వర్త్ లూయిస్ ప్రకారం అప్పటి వరకు 13 బంతుల్లో 22 పరుగులుగా ఉన్న లక్ష్యాన్ని 7 బంతుల్లో 22 పరుగులుగా నిర్ణయించారు. అయితే, మిస్కమ్యూనికేషన్ వల్ల ఏడు బంతులు కాస్తా ఒక బంతిగా మారింది. దీంతో దక్షిణాఫ్రికా ఆటగాళ్ల హృదయం బద్దలైంది. తీవ్ర ఆవేదనతో సఫారీలు మైదానాన్ని వీడారు. స్టేడియంలోని సౌతాఫ్రికా అభిమానుల వేదనకు అంతే లేకుండా పోయింది.