చెన్నై: ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే రాయల్చాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ఆ టీమ్ బౌలర్ హర్షల్ పటేల్ ఐదు వికెట్లతో ముంబై ఇండియన్స్కు చుక్కలు చూపించాడు. దీంతో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. హర్షల్ చివరి ఓవర్లోనే 3 వికెట్లు తీయడంతోపాటు మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. బెంగళూరు తరఫున ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్ హర్షల్ కావడం విశేషం. తొలి పది ఓవర్లలో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసి భారీ స్కోరు చేసేలా కనిపించిన ముంబై.. ఒక్కసారిగా కుప్పకూలింది. తొలి ఓవర్లోనే 15 పరుగులు ఇచ్చిన హర్షల్.. తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. ముంబై స్టార్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, పొలార్డ్లను అతడు అవుట్ చేశాడు.
ఓపెనర్ క్రిస్ లిన్ (35 బంతుల్లో 49) మాత్రమే రాణించాడు. ఇక యువ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 28), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 31) పర్వాలేదనిపించారు. హార్డ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా (10) విఫలమయ్యాడు. చివర్లో చెలరేగుతారనుకున్న పొలార్డ్, కృనాల్ పాండ్యా.. ఆర్సీబీ కట్టుదిట్టమైన బంతుల ముందు తలవంచారు. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. చివరి ఓవర్లో అయితే కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చి మూడు వికెట్లు తీసుకోగా.. మరొక రనౌట్తో ఆ ఓవర్లో మొత్తం 4 వికెట్లు పడ్డాయి. మరోవైపు సిరాజ్ వికెట్ తీయకపోయినా.. పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతడు 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు ఇచ్చాడు.