సిరీస్లో నిలువాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితుల్లో భారత్ జూలు విదిల్చింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ మూడో వన్డేలో దక్షిణాఫ్రికా భరతం పట్టింది. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ అర్ధసెంచరీలతో పోరాడే స్కోరు అందుకున్న టీమ్ఇండియా..అద్భుతమైన బౌలింగ్తో సఫారీలను కట్టడి చేసింది. చాహల్ స్పిన్కు తోడు హర్షల్ పటేల్ పేస్ బౌలింగ్తో వరుస విరామాల్లో వికెట్లుపడగొట్టి సిరీస్లో తొలి విజయాన్నందుకుంది.
విశాఖపట్నం: దక్షిణాఫ్రికా వరుస విజయాలకు భారత్ బ్రేక్ వేసింది. ఢిల్లీ, కటక్లో ఎదురైన ఓటములకు విశాఖపట్నంలో టీమ్ఇండియా కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. సిరీస్లో గెలిస్తేనే నిలువాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో రిషబ్పంత్ నేతృత్వంలోని భారత్ సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా 48 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. దీని ద్వారా ఐదు మ్యాచ్ల్లో బోణీ కొట్టి ప్రస్తుతం సిరీస్లో 1-2తో నిలిచింది. తొలుత భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 179/5 స్కోరు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. మూడు కీలక వికెట్లు తీసిన చాహల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
గైక్వాడ్, కిషన్ విజృంభణ
తొలుత సఫారీలకు టాస్ చేజార్చుకున్న పంత్సేన నిర్ణీత 20 ఓవర్లలో 179/5 స్కోరు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(35 బంతుల్లో 57, 7 ఫోర్లు, 2 సిక్స్లు), ఇషాన్ కిషన్(35 బంతుల్లో 54, 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ఆది నుంచే సఫారీ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ వీరిద్దరు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా గత మ్యాచ్ల్లో విఫలమైన గైక్వాడ్ ఆకట్టుకున్నాడు. ఎన్రిచ్ నోర్జె వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో వరుస బంతుల్లో గైక్వాడ్ ఫోర్లు కొట్టి ఔరా అనిపించాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 57 పరుగులు చేసింది. దూకుడైన బ్యాటింగ్తో ఆకట్టుకున్న గైక్వాడ్ టీ20ల్లో తొలి అర్ధసెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఓ దశలో వీరిద్దరి జోరు చూస్తే భారత్కు భారీ స్కోరు ఖాయమని అనిపించింది. అయితే కేశవ్ మహారాజ్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ద్వారా గైక్వాడ్ ఔట్ కావడంతో తొలి వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన అయ్యర్(14), కెప్టెన్ పంత్(6) నిరాశపర్చగా, హార్దిక్ పాండ్యా(21 బంతుల్లో 31 నాటౌట్, 4 ఫోర్లు) ధనాధన్ ఆటతీరుతో చెలరేగాడు. ప్రిటోరియస్ రెండు వికెట్లు దక్కగా, శంసీ, మహారాజ్, రబాడ ఒక్కో వికెట్ తీశారు.
చాహల్ కమాల్
180 పరుగుల లక్ష్యఛేదనకు కోసం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు సరైన శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్లో అదరగొట్టిన కెప్టెన్ బవుమా(8) నిరాశపరిచాడు. హర్షల్ బౌలింగ్లో బవుమా తొలి వికెట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెండ్రిక్స్(23), ప్రిటోరియస్(20) సరిగ్గా నిలదొక్కుకోలేకపోయారు. భారీ షాట్కు ప్రయత్నించిన హెండ్రిక్స్..చాహల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరుగగా, ప్రిటోరియస్ను చాహల్ పెవిలియన్ పంపాడు. డస్సెన్(1) సింగిల్ డిజిట్కే పరిమితం కాగా, క్లాసెన్(29), పార్నెల్(22 నాటౌట్) పోరాటపటిమ కనబరిచారు. పంత్ తెలివిగా బౌలర్లను మార్చడం భారత్కు కలిసి వచ్చింది. .
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 179/5(గైక్వాడ్ 57, కిషన్ 54, ప్రిటోరియస్ 2/29, మహారాజ్ 1/24), దక్షిణాఫ్రికా: 19.1 ఓవర్లలో 131 ఆలౌట్ (క్లాసెన్ 29, హెండ్రిక్స్ 23, పటేల్ 4/25, చాహల్ 3/20)