WPL | బెంగళూరు: గ్రేస్ హ్యారిస్ (33 బంతుల్లో 60 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో యూపీ వారియర్స్ రెండో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో యూపీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. లిచ్ఫీల్డ్ (35), ఆష్లే గార్డ్నర్ (30), వాల్వర్ట్ (28) తలా కొన్ని పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో సోఫియా 3 వికెట్లు పడగొట్టింది.
అనంతరం లక్ష్యఛేదనలో 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. కెప్టెన్ అలీసా హీలీ (33; 7 ఫోర్లు) ఆరంభంలో వరుస బౌండ్రీలతో బెంబేలెత్తించగా.. డబ్ల్యూపీఎల్లో అరంగేట్రం చేసిన చమరి ఆటపట్టు (17; 4 ఫోర్లు) పర్వాలేదనిపించింది. ఆఖర్లో గ్రేస్ విజృంభించడంతో యూపీ సునాయాసంగా గెలుపొందింది. నాలుగు మ్యాచ్లు ఆడిన యూపీకి ఇది రెండో విజయం కాగా.. గుజరాత్ మూడు మ్యాచ్లు ఆడి బోణీ కొట్టలేకపోయింది. హ్యారిస్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.