Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలానికి ముందే ఆటగాళ్ల బదిలీ ప్రక్రియతో ఆయా జట్లు వచ్చే సీజన్లో ఆడబోయే జట్టుపై ఓ క్లారిటీకి వచ్చేస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ సారథిగా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యా.. ఆ జట్టుకు గుడ్ బై చెప్పి (?) ముంబై ఇండియన్స్ గూటికి చేరబోతున్నాడని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అతడు కేవలం ఆటగాడిగానే గాక సారథి రేసులో కూడా ఉన్నాడని తెలుస్తున్నది. రూ. 15 కోట్లు చెల్లించి హార్ధిక్ను తీసుకునేందుకు అంగీకరించిన ముంబై.. రోహిత్ తర్వాత పాండ్యాకు ఆ పగ్గాలను అప్పజెప్పేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.
అప్పుడే ప్రతిపాదన..
2015లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన హార్ధిక్ ఆరంభం నుంచి ముంబైకి ఆడాడు. ఆ జట్టు విజయాలలో కీరన్ పొలార్డ్, హార్ధిక్ పాండ్యాలది కీలక పాత్ర. అయితే 2022కు ముందు పాండ్యాను ముంబైని వీడాడు. ముంబై అతడిని వేలంలోకి వదిలేయగా గుజరాత్ అతడిని కెప్టెన్ చేసింది. రోహిత్ మరో రెండు సీజన్ల కంటే ఎక్కువ ఆడే అవకాశం లేకపోవడంతో పాండ్యా ముంబై సారథ్య పగ్గాలు అడిగాడని, కానీ ఈ ప్రతిపాదనను ముంబై తిరస్కరించినట్టు గతంలో పుకార్లు షికార్లు చేశాయి.
ఇప్పుడూ అదే డిమాండ్..
2013లో ముంబై పగ్గాలు చేపట్టిన రోహిత్.. ఆ జట్టుకు ఏకంగా ఐదు ట్రోఫీలను అందించాడు. కానీ గత రెండేండ్లుగా రోహత్ భారత కెప్టెన్సీ బాధ్యతలనూ మోస్తుండటంతో ఐపీఎల్లో ముంబై ఆట ఆశించిన స్థాయిలో లేదనేది నిర్వివాదాంశం. రోహిత్ మహా అయితే ఈ సీజన్కు మించి ఆడే అవకాశాలూ లేవు. దీంతో ఆ జట్టు కెప్టెన్ వేటలో ఉండగా గుజరాత్తో హార్ధిక్ విభేదాలు ముంబైకి కలిసొచ్చాయి. ఇదివరకే గుజరాత్ సారథిగా నిరూపించుకున్న పాండ్యాను తిరిగి ముంబైలోకి తీసుకొచ్చి అతడికే కెప్టెన్సీ అప్పజెప్పనున్నారని సమాచారం.
సూర్యకు షాకే..
రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే ఆ బాధ్యతలను పాండ్యాకు గనక అప్పజెప్పితే హిట్మ్యాన్ నీడలో ఎదిగిన సూర్యకుమార్ యాదవ్కు షాక్ తప్పదు. గత సీజన్లో రోహిత్ గైర్హాజరీలో సూర్య పలు మ్యాచ్లకు సారథిగా జట్టును నడిపించాడు. వన్డేలలో తన మార్కు చూపించకపోయినా టీ20లలో మాత్రం అతడు ఇప్పటికీ వరల్డ్ నెంబర్ బ్యాటరే. హార్ధిక్ గైర్హాజరీలో సూర్య ప్రస్తుతం స్వదేశంలో ఆసీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత జట్టును నడిపిస్తున్నాడు. కానీ హార్ధిక్ వస్తే అతడు తిరిగి వైస్ కెప్టెన్సీకి వెళ్లాల్సిందే. టీమిండియాలోనే కాదు.. ముంబైలో కూడా సూర్య.. పాండ్యాకు డిప్యూటీగానే ఉండాల్సిందేనని ముంబై అభిమానులు భావిస్తున్నారు.