భారత్ మరో సిరీస్పై గురి పెట్టింది. ఉత్కంఠ విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించిన
టీమ్ఇండియా అదే జోరులో శ్రీలంకపై సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది. సీనియర్ల గైర్హాజరీలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న యువకులు సత్తాచాటుతుండటం భారత్కు కలిసి వస్తుండగా, తామేం తక్కువ కాదని లంక చేతల్లో చూపిస్తున్నది. గెలుపు దోబూచులాడిన తొలి మ్యాచ్లో అదృష్టం కొద్ది విజయం వైపు భారత్ నిలిచింది. మరో మ్యాచ్ మిగిలుండగానే పుణెలోనే సిరీస్ పట్టేయాలని పాండ్యా గ్యాంగ్ చూస్తుంటే.. సమం కోసం లంక ప్రయత్నిస్తున్నది.
పుణె: ‘మిషన్-2024’లో భాగంగా భారత్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. ఆల్రౌండర్ హార్దిక్పాండ్యా సారథ్యంలో టీమ్ఇండియా కొత్తపుంతలు తొక్కుతున్నది. పుణె వేదికగా గురువారం భారత్, శ్రీలంక మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. సొంతగడ్డపై తమకు తిరుగులేదన్న రీతిలో సత్తాచాటేందుకు టీమ్ఇండియా ఉవ్విళ్లూరుతున్నది. తొలిమ్యాచ్లో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ విఫలమైనా..ఆఖర్లో దీపక్ హుడా, అక్షర్ పటేల్ చెలరేగడంతో భారత్ పోరాడే స్కోరు అందుకుంది. అయితే బౌలర్ల అనుభవలేమి ఒకరకంగా టీమ్ఇండియాను ఇబ్బందులకు గురిచేసింది. హర్షల్ పటేల్ తీవ్రంగా నిరుత్సాహ పర్చగా, అరంగేట్రం బౌలర్ శివమ్ మావి అంచనాలకు మించి రాణించాడు.
కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని అక్షర్ పటేల్ వమ్ము చేయకుండా జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. గాయపడ్డ సంజూ శాంసన్ స్థానంలో జితేశ్ శర్మను జట్టుకు ఎంపిక చేశారు. లంకతోతొలి మ్యాచ్ సందర్భంగా బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో శాంసన్ మోకాలికి గాయమైంది. స్కానింగ్ పరీక్షల కోసం శాంసన్ను ముంబైలోనే ఉండాలని బోర్డు స్పష్టం చేసింది.
లంక పుంజుకోవాలని: తొలి మ్యాచ్ను తృటిలో చేజార్చుకున్న లంక తిరిగి పుంజుకోవాలని చూస్తున్నది. భారత్ను ఓడించినంత పనిచేసిన లంక రెండో మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమం చేసేందుకు పట్టుదలతో ఉంది.