ముల్లాన్పూర్: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. ఆఫ్ఘనిస్తాన్తో జరిగే వన్డే సిరీస్లో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం నుంచి ఆఫ్ఘనిస్తాన్తో మూడు వన్డేలు జరగనున్నాయి. ఫస్ట్ వన్డే ధర్మశాలలో ఆడనున్నారు. అయితే పాండ్యా పూర్తిగా ఫిట్గా ఉన్నట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు చెందిన నిపుణుల బృందం పేర్కొన్నది. పాండ్యాకు ఆ టీమ్ క్లియరెన్స్ ఇచ్చింది. బెంగుళూరులోని సెంటర్లో అతను పూర్తి స్థాయిలో 10 ఓవర్లు బౌలింగ్ చేసినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరపున కెప్టెన్స్ చేపట్టిన పాండ్యా వెన్ను నొప్పి వల్ల కొన్ని మ్యాచ్లు ఆడలేదు. దీంతో అతను జూన్ రెండో తేదీ నుంచి బెంగుళూరు సెంటర్లో శిక్షణ పొందాడు. కోలుకునే దశలో భాగంగా పాండ్యా 10 ఓవర్లు బౌలింగ్ చేశాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం పాండ్యా ఫిట్నెస్ బాగానే ఉందని, అన్ని పారామీటర్స్ సరిగ్గా ఉన్నట్లు సీఈవో కోచ్లు తెలిపారు. పాండ్యా ఫిట్నెస్ గురించి అప్డేట్ తెలియకున్నా, అతను బాగానే ప్రిపేరవుతున్నట్లు తెలిసిందని భారత అసిస్టెంట్ కోచ్ సీతాన్షు కోటక్ తెలిపారు.
వైట్బాల్ క్రికెట్లో పాండ్యా కీలకమైన వ్యక్తిగా మారనున్నాడు. పేస్ బౌలింగ్తో పాటు చివరి ఓవర్లలో భారీ షాట్లు ఆడగలడు. ఇక 50 ఓవర్ల వన్డేలో పాండ్యా 10 ఓవర్లు బౌలింగ్ చేయడం చాలా కీలకం కానున్నది. ప్రస్తుతం భారత వన్డే జట్టు చండీఘడ్లో శిక్షణ పొందుతోంది. అయితే ఆ టీమ్తో పాండ్యా జతకలుస్తాడా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఇక మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం బెంగుళూరు సెంటర్లోనే ట్రైనింగ్ కొనసాగిస్తున్నాడు.