Hardik Pandya | బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులలో భాగంగా జట్టుకు పలు కారణాల వల్ల దూరమై దేశవాళీలు ఆడమంటే ఆడకుండా ఉన్న శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు బోర్డు షాకిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరి మాదిరిగానే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా గతేడాది నవంబర్ నుంచి ఆడటం లేదు. అయితే ఇషాన్, అయ్యర్ల కాంట్రాక్టులను తొలగించిన బీసీసీఐ.. పాండ్యాకు మాత్రం గ్రేడ్ ‘ఏ’ కేటగిరీ ఇచ్చింది. ఇది కచ్చితంగా ఆ ఇద్దరు క్రికెటర్ల మీద వివక్ష అని, బీసీసీఐ ఆదేశాలు అందరు ఆటగాళ్లకు వర్తించవా..? అంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. అయితే హార్ధిక్ మాత్రం.. దేశవాళీలలో తాను కూడా ఆడతానని బీసీసీఐకి హామీ ఇచ్చాడట..
ఇదే విషయమై బోర్డు ప్రతినిధి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ… ‘మేం పాండ్యాతో చర్చలు జరిపాం. అతడు జాతీయ జట్టులో తనకు మ్యాచ్లు లేకుంటే దేశవాళీలో ఆడతానని హామీ ఇచ్చాడు. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో ఆడతానని మాకు మాటిచ్చాడు. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ సూచన ప్రకారం అతడు రంజీలలో ఐదు రోజుల పాటు ఆడుతూ బౌలింగ్ చేసే స్థితిలో అయితే లేడు. అందుకే అతడు వైట్బాల్ టోర్నీలు ఆడతానని హామీ ఇచ్చాడు. ఒకవేళ అతడు ఈ టోర్నీలు ఆడకుంటే తన కాంట్రాక్టును కోల్పోతాడు…’ అని చెప్పడం గమనార్హం.
వన్డే వరల్డ్ కప్లో గాయమైన పాండ్యా.. కొన్నాళ్ల పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో గడిపాడు. తర్వాత బరోడాలోని కిరణ్ మోరే అకాడమీలో ప్రత్యేక శిక్షణ పొందాడు. అతడు తాజాగా డీవై పాటిల్ టీ20 కప్లో రిలయన్స్ 1 టీమ్కు కెప్టెన్గా ఆడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ – 2024లో ముంబై ఇండియన్స్ తరఫున సారథిగా బరిలోకి దిగనున్న హార్ధిక్.. ఈ సీజన్ కోసం సిద్ధమయ్యే పనిలో ఉన్నాడు.