హైదరాబాద్ : దేశంలో హ్యాండ్బాల్కు విశేష ఆదరణ పెరిగే దిశగా కీలక అడుగుపడింది. భారత హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడు (హెచ్ఎఫ్ఐ) జగన్మోహన్ రావు కృషితో ఖేలో ఇండియాలో హ్యాండ్బాల్కు చోటు దక్కింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2021లో హ్యాండ్బాల్ను క్రీడాంశంగా చేర్చినట్టు కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హ్యాండ్బాల్కు ఖేలో ఇండియా గుర్తింపు లభించడంతో హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్మోహన్ రావు హర్షం వ్యక్తం చేశారు.
కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు, భారత ఒలింపిక్ సంఘం, భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్), రాష్ట్ర క్రీడామంత్రిత్వశాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో హ్యాండ్బాల్ అభివృద్ధికి ఈ గుర్తింపు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని ఆయన అన్నారు. హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికై ఆరు నెలలు గడువకముందే హ్యాండ్బాల్కు ఖేలో ఇండియాలో చోటు దక్కడం విశేషం.