IND vs WI | వన్డేల్లో వెస్టిండీస్పై భారత్ అప్రతిహత విజయయాత్ర కొనసాగుతున్నది. నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యఛేదనలో విండీస్.. శార్దుల్ ఠాకూర్, ముఖేశ్ కుమార్ ధాటికి స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. తొలుత శుభ్మన్ గిల్, ఇషాన్కిషన్, శాంసన్, హార్దిక్ పాండ్యా అర్థసెంచరీలతో టీమ్ఇండియా 351 పరుగుల మార్క్ అందుకుంది. సొంత ఇలాఖాలో విండీస్ బౌలర్లు ఘోరంగా తేలిపోయారు.
తరౌబా(ట్రినిడాడ్): వెస్టిండీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన పోరులో టీమ్ఇండియా 200 పరుగుల తేడాతో విండీస్పై ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 352 పరుగుల లక్ష్యఛేదనలో విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకు పరిమితమైంది. శార్దూల్ ఠాకూర్(4/37), ముఖేశ్కుమార్(3/30) ధాటికి కరీబియన్లు బ్యాట్లు ఎత్తేశారు. గుడకేశ్ మోతీ(39), అలిక్ అతనాజె(32) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. మూడు మ్యాచ్ల్లో అర్ధసెంచరీలు చేసిన ఇషాన్కిషన్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కగా, శుభ్మన్ గిల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.
శార్దుల్, ముఖేశ్ విజృంభణ : భారీ లక్ష్యఛేదనలో విండీస్ ఆది నుంచే ఘోరం గా తడబడింది. టీమ్ఇండియా బ్యాటర్లు పరుగుల వరద పారించిన చోట విండీస్ క్రికెటర్లు కనీస పోరాట పటిమ కనబర్చలేకపోయారు. ముఖేశ్ కుమార్ వేసిన ఇన్నిం గ్స్ తొలి ఓవర్లోనే బ్రెండన్ కింగ్(0) డకౌట్గా వెనుదిరిగాడు. మూడో ఓవర్లో కైల్ మయేర్స్(4) కూడా పెవిలియన్ చేరడంతో విండీస్ ఏడు పరుగులకే ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. సీనియర్ల గైర్హాజరీలతో జట్టులోకి వచ్చిన యువ పేసర్ ముఖేశ్ కుమార్ తనదైన స్వింగ్ బౌలింగ్తో విండీస్ బ్యాటింగ్ను మొదట్లో దెబ్బతీశాడు. మిడిల్లో శార్దుల్ ఠాకూర్ విజృంభించడంతో విండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇదే అదనుగా మరోవైపు చైనామన్ కుల్దీప్యాదవ్(3/30) కూడా చెలరేగడం విండీస్ అవకాశాలను దెబ్బతీసింది. కెప్టెన్ షాయ్ హోప్ (5), కార్టీ (6), హెట్మైర్ (4), రోమారియో షెఫర్డ్ (8) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. ఆఖర్లో గుడకేశ్ బ్యాటు ఝులిపించినా..భారీ లక్ష్యం కావడంతో విజయం సాధ్యం కాలేదు.
భారత్: 50 ఓవర్లలో 351/5(గిల్ 85, కిషన్ 77, షెఫర్డ్ 2/73, క్యారీ 1/58),
వెస్టిండీస్: 35.3 ఓవర్లలో 151 ఆలౌట్(గుడకేశ్ 39 నాటౌట్, అలిక్ 32, శార్దుల్ 4/37), ముఖేశ్ కుమార్ 3/30).