హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్రంలో ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించే సదుద్దేశంతో సీఎం కప్ టోర్నీని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా టోర్నీల ద్వారా ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి 31 వరకు సీఎం కప్ నిర్వహణకు సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు ఇవ్వగా, బుధవారం అంబేద్కర్ సచివాలయంలో అధికారులు, క్రీడా సంఘాలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా క్రీడా సంఘాల ప్రతినిధులు సలహాలు, సూచనలతో మంత్రి అధికారులను దిశానిర్దేశం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నీ కోసం ప్రభుత్వం 3.60 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. టోర్నీని విజయవంతం చేసేందుకు మొత్తం 14 నిర్వాహణ కమిటీలను ఏర్పాటు చేశారు. కీలకమైన ఫుడ్ కమిటీ, వసతి, రవాణా సౌకర్యం, సీఎం కప్ ప్రారంభ ఏర్పాట్లను జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్ చీఫ్ జగన్మోహన్రావు పర్యవేక్షించనున్నారు. తెలంగాణ ఒలింపిక్ కమిటీ సాంకేతిక సాయం అందించనుంది. ఈ కార్యక్రమంలో టీవోఏ కార్యదర్శి జగదీశ్యాదవ్, ఉపాధ్యక్షులు ప్రేమ్రాజ్, వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.