Jio Cinema: ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ మూడ్లో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు జియో సినిమా మరో గుడ్ న్యూస్ చెప్పింది. విశ్వకప్ ముగిసిన వెంటనే భారత్.. నాలుగు రోజుల గ్యాప్లోనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్తో బిజిబిజీగా గడపనుంది. ఆ తర్వాత మళ్లీ ఐపీఎల్ వరకూ టీమిండియాకు ఊపిరిసలపని షెడ్యూల్ ఉంది. ఆసీస్ తర్వాత అఫ్గాన్, ఇంగ్లండ్ లతోనూ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లన్నింటినీ ఎలాంటి రుసుము లేకుండానే ఉచితంగా ప్రసారం చేసేందుకు జియో సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా జియో సినిమా ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించింది.
ప్రపంచకప్ తర్వాత భారత్ ఆడబోయే మూడు సిరీస్లను ఉచితంగానే ప్రసారం చేస్తామని జియో సినిమా తెలిపింది. టెలివిజన్ (స్పోర్ట్స్ 18)తో పాటు మొబైల్స్ (జియో సినిమా యాప్)లలో కూడా సిరీస్లను ఉచితంగానే వీక్షించొచ్చని ట్విటర్లో పేర్కొంది. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియాతో మొదలుకాబోయే ఐదు మ్యాచ్లు టీ20 సిరీస్తో పాటు అఫ్గానిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్, ఇండియా – ఇండియా మధ్య జరుగబోయే ఐదు టెస్టులనూ ఫ్రీగానే అందించనున్నట్టు తెలిపింది.
Don’t put away your blue jersey just yet, the season’s only getting started after the World Cup – at the new home of Indian cricket & it’s bigger than you’ve ever imagined!#INDvAUS, #INDvAFG & #INDvENG coming soon, LIVE on Sports18 & streaming FREE on JioCinema #JioCinemaSports pic.twitter.com/gr5t5bEQhI
— JioCinema (@JioCinema) November 13, 2023
కొద్దిరజుల క్రితమే వయాకామ్ 18.. భారత క్రికెట్ జట్టు రాబోయే ఐదేండ్లలో స్వదేశంలో ఆడబోయే మ్యాచ్లకు ప్రసారకర్తగా ఉండేందుకు గాను రూ. 5,963 కోట్లతో మీడియా హక్కులను దక్కించుకున్న విషయం తెలిసిందే. సోనీ నెట్వర్క్, డిస్నీ స్టార్ వంటి సంస్థలు పోటీపడ్డా జియో భారీ ధర చెల్లించి ఈ హక్కులను దక్కించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్తో ఈ ఒప్పందం ప్రారంభమైంది.
భారత్ – ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్: నవంబర్ 23 నుంచి డిసెంబర్ 03 వరకు
భారత్ – అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్లు టీ20 సిరీస్: జనవరి 11 నుంచి 17 వరకు
భారత్ – ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్: జనవరి 25 నుంచి మార్చి 11 వరకు