ఆసియా రోయింగ్ ఛాంపియన్షిప్ చివరి రోజు కూడా భారత రోవర్లు మెరిశారు. ఈ టోర్నీలో చివరి రోజైన ఆదివారం నాడు భారత క్రీడాకారులు ఒక బంగారు పతకంతోపాటు మూడు రజత పతకాలు సాధించారు. లైట్ వెయిట్ మెన్స్ సింగిల్ స్కల్స్ విభాగంలో అర్వింద్ సింగ్ బంగారు పతకం సాధించాడు.
టోక్యో ఒలింపిక్స్లో అర్విండ్ 11వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో అందరికన్నా వేగంగా 7:55:942 సెకన్లలో తన రేసును ముగించి స్వర్ణపతకాన్ని ఒడిసిపట్టాడు. దీంతోపాటు లైట్ వెయిట్ డబుల్ స్కల్స్, మెన్స్ క్వాడ్రుపుల్ స్కల్స్, మెన్స్ కాక్స్లెస్ ఫోర్స్ విభాగాల్లో భారత రోవర్లు రజతాలు సాధించారు.
లైట్ వెయిట్ విభాగంలో ఆశిష్ ఫూగట్, సుఖ్జీందర్ సింగ్ కలిసి 7:12:568 సెకన్ల టైమింగ్తో రెండో స్థానంలో నిలిచారు. క్వాడ్రపుల్ స్కల్స్ విభాగంలో బిట్టూ సింగ్, జకార్ ఖాన్, మన్జీత్ కుమార్, సుఖ్మీత్ సింగ్ పోటీ పడ్డారు. వీరు 6:33:661 సెకన్ల టైమింగ్ రికార్డు చేసి, కేవలం 0.523 సెకన్ల తేడాతో బంగారు పతకాన్ని మిస్ అయ్యారు.
కాక్స్లెస్ ఫోర్స్ ఫైనల్లో జస్వీర్ సింగ్, పునీత్ కుమార్, గుర్మీత్ సింగ్, చరణ్జీత్ సింగ్ కలిసి 6:51:661 సెకన్లతో రజత పతకం సాధించారు. మొత్తమ్మీద రెండు బంగారు పతకాలు, నాలుగు రజత పతకాలతో భారత్ ఈ టోర్నీని ముగించింది.
ఈ సందర్భంగా రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ ఎమ్వీ శ్రీరామ్.. భారత బృందాన్ని అభినందించారు. క్రీడాకారులను, కోచ్లు, సహాయక సిబ్బంది, బ్యాక్ఎండ్ అడ్మినిస్టేటర్లను ఆయన అభినందించారు. ఏటా భారత్కు అద్భుతమైన ఫలితాలు అందిస్తున్న భారత రోయింగ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ను ప్రత్యేకంగా అభినందించారు.