శంషాబాద్ రూరల్, సిటీబ్యూరో: ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్ సందడి మొదలైంది. భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న రేసింగ్కు విశ్వనగరం హైదరాబాద్ వేదిక కాబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం రేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నది. తొమ్మిదో సీజన్లో భాగంగా నాలుగో రేసు ఈ నెల 11న హైదరాబాద్లో జరుగనుంది. ఇందుకోసం దిరియా(సౌదీ అరేబియా) నుంచి ఫార్ములా-ఈ కార్లు హైదరాబాద్కు చేరుకున్నాయి. బుధవారం రాత్రి 11.50 నిమిషాలకు ప్రత్యేకమైన బోయింగ్ కార్గో విమానంలో 90 టన్నుల రేసింగ్ కార్ల భాగాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చాయి.
ఆటో విడిభాగాలకు చెందిన 83 బాక్స్లతో కూడిన కార్గో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్లాట్ల వద్ద నిలిపిన విమానం నుంచి ఆఫ్లోడ్ చేశారు. వాటిని అన్లోడింగ్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన కార్గో హ్యాండ్లింగ్ పరికరాలను ఉపయోగించి జీహెచ్ఏసీ టెర్మినల్లోని ప్రత్యేకమైన హ్యాండ్లింగ్ ప్రాంతానికి ఆప్రాన్ నుంచి ల్యాండ్సైడ్ వరకు గ్రీన్చానెల్ ఏర్పాటు చేశారు. వివిధ టచ్ పాయింట్లలో వేగంవంతమైన ఆన్సైట్ కస్టమ్స్ క్లియరెన్స్తో విడి భాగాలకు వేగంగా అనుమతులు మంజూరు చేశారు. ఫార్ములా-ఈ బృందానికి సహాయం చేయడానికి షిప్మెంట్ ప్రక్రియ సమర్థవంతమైన నిర్వహణ కోసం హైదరాబాద్ కార్గో వారు ఒక మల్టీ-స్టేక్హోల్డర్ క్రాక్ టీమ్ ఏర్పాటు చేశారు. త్వరలో మరో రెండు విమానాలలో మిగతా రేసింగ్ కార్ల భాగాలు హైదరాబాద్కు చేరుకోనున్నాయి. ప్రత్యేకమైన గ్రీన్చానల్ ద్వారా ఫార్ములా-ఈ కార్లు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయని ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ ఫణికర్ పేర్కొన్నారు. దేశంలో తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఫార్ములా-ఈ రేసింగ్ కోసం ఎయిర్కార్గో సేవలు అందించడంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు.
ఫార్ములా-ఈ రేసింగ్ కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే నగరానికి కార్లు చేరుకోగా, ట్రాక్ను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్కో సంయుక్తంగా నిర్వహిస్తున్న రేసింగ్ కోసం ప్రత్యేక స్టాండ్లు నిర్మిస్తున్నారు. అభిమానులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా స్టాండ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే బుక్ మై షో ద్వారా ఆన్లైన్ టిక్కెట్లు అందుబాటులో ఉంచగా, హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. ఫార్ములా రేసింగ్ను ప్రత్యక్షంగా చూసేందుకు నగరవాసులు అమితాసక్తి కనబర్చడమే ఇందుకు ఉదాహరణ. గురువారం ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై రేసింగ్ నిర్వాహకులతో కలిసి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షించారు.