New Test Captain | రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా రెడ్బాల్ ఫార్మాట్లో కెప్టెన్ ఎవరు ? అనే చర్చ సాగుతున్నది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా రోహిత్ తొలి టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో మిస్టరీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తాజాగా టెస్టులకు యువ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్గా ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది.
వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిషబ్ పంత్కు వైస్ కెప్టెన్గా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. వైస్ కెప్టెన్ ఎంపిక విషయంలో బీసీసీఐకి ఓ స్పష్టత ఉందని తెలుస్తున్నది. రిషబ్ పంత్ విదేశీ పిచ్లపై ఆడిన అనుభవం ఉంది. విదేశీ పరిస్థితుల్లోనూ మెరుగ్గానే రానించాడు. మరో వైపు జస్ప్రీత్ బుమ్రా పేరును కెప్టెన్, వైస్ కెప్టెన్కి పరిశీలించినా.. ఫిట్నెస్ ఇబ్బందికరంగా మారుతోంది. తరుచూ గాయాల బారినపడుతున్న క్రమంలో ఏ సిరీస్ ఆడుతాడో.. లేదో తెలియని పరిస్థితి. అయితే, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలో 42 కంటే ఎక్కువ సగటుతో ఈ ఫార్మాట్లో పరుగులు చేసిన బ్యాట్స్మెన్లలో పంత్ ఒకడు. ఆయా దేశాల్లో ఏడుసార్లు 90-99 మధ్య పరుగులు చేశాడు.
ఇదిలా ఉండగా.. బుమ్రాకు కెప్టెన్ ఇవ్వకుండా.. వైస్ కెప్టెన్గా పేరును ప్రతిపాదించడంలో అర్థం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లుగా పీటీఐ పేర్కొంది. మరో వైపు సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సైతం టెస్టులకు గుడ్బై చెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయంపై బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇంగ్లాండ్ సిరీస్ నేపథ్యంలో నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరినట్లు పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే, విరాట్ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నది. అయితే, గిల్ తనను తాను మెరుగుపరుచుకునేందుకు ఇంగ్లాండ్లో అతనికే కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్ పర్యటన కోసం బీసీసీఐ ఈ నెల 23న జట్టును ప్రకటించనున్నది. అప్పుడే కెప్టెన్ ఎవరో స్పష్టత వస్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.