Gautam Gambhir : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు జైత్రయాత్రపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు జట్టు స్వరూపాన్నే మార్చేశాడని, రోహిత్ శర్మ అతని వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడంతే అని గంభీర్ అన్నాడు. ఢిల్లీ టెస్టులో ఇండియా విజయం అనంతరం గంభీర్ స్టార్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘నిజాయితీగా చెప్పాలంటే.. రోహిత్ శర్మ ఒక అద్భుతమైన కెప్టెన్. అయితే.. ఈ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ, అతని కెప్టెన్సీలో పెద్ద తేడా ఏం లేదు. కోహ్లీ ఈ జట్టును తీర్చిదిద్దాడు. రోహిత్ అతని మార్గాన్నే అనుసరిస్తున్నాడు.
స్పిన్నర్లు అశ్విన్, జడేజాలను కోహ్లీ ఉపయోగించుకున్న తీరు అద్భుతం. ఇప్పుడు రోహిత్ కూడా అదే చేస్తున్నాడు. షమీ, సిరాజ్, బుమ్రా, జడేజా, అశ్విన్, అక్షర్పటేల్ అద్భుతంగా రాణిస్తున్నార’ని ఈ మాజీ ఓపెనర్ తెలిపాడు. అంతేకాదు స్వదేశంలో అదరగొడుతున్నరోహిత్కు కెప్టెన్గా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా పర్యటనలు సవాల్ విసురుతాయని వెల్లడించాడు.
కోహ్లీ సారథ్యంలో టీమిండియా టెస్టుల్లో ఎదురులేని జట్టుగా అవతరించింది. మైదానంలో దూకుడుగా ఉండే కోహ్లీ జట్టు మొత్తాన్ని అలానే తీర్చిదిద్దాడు. అతని నాయకత్వంలో భారత్ వరల్డ్ ర్యాకింగ్స్లో నంబర్ వన్ అయింది. స్వదేశంలోనే కాకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డపై కూడా సిరీస్లు నెగ్గింది. అంతేకాదు ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా అడుగుపెట్టింది. అయితే.. ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. నాగ్పూర్ టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 132 రన్స్తో గెలుపొందింది. ఢిల్లీ టెస్టులో 6 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. దాంతో, నాలుగు టెస్టుల సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు దిశగా ముందుడుగు వేసింది. ఇండోర్, అహ్మదాబాద్ టెస్టుల్లో ఏదో ఒకటి గెలిచినా కూడా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియంలో డబ్ల్యూటీసీ టైటిల్ పోరు జరగనుంది. మూడో టెస్టు ఇండోర్ వేదికగా మార్చి 1న ప్రారంభం కానుంది.