West Indies Cricket :వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(West Indies Cricket Board)కు పెద్ద షాక్. ఒకేసారి ఏకంగా నలుగురు స్టార్ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికారు. విండీస్ మహిళా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన అనిశా మొహమ్మద్(Anisa Mohammed), శకేర సెల్మన్(Shakera Selman)లతో పాటు ట్విన్ సిస్టర్స్ కిషోన నైట్ (Kyshona Knight), కిసియా నైట్(Kycia Knight)లు గురువారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నలుగురు 2016లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులు కావడం విశేషం. అనుభవజ్ఞులైన ఈ నలుగురు ఒకేసారి ఆటకు గుడ్ బై చెప్పడంతో అభిమానులు షాకవుతున్నారు.
ఆఫ్ స్పిన్నర్ అయిన అనిశా 2003లో తొలి వన్డే మ్యాచ్ ఆడింది. తన 20 ఏండ్ల కెరీర్లో ఆమె టీ20ల్లో 125 వికెట్లు, వన్డేల్లో 141 వికెట్లు పడగొట్టింది. దాంతో వెస్టిండీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన తొలి విండీస్ బౌలర్ కూడా అనిశానే. మరోవిషయం ఏంటంటే.. అనిశా తన సుదీర్ఘ కెరీర్లో వన్డే వరల్డ్ కప్తో పాటు ఏడు టీ20 ప్రపంచకప్లు ఆడింది.
Anisa Mohammed, Shakera Selman, Kycia Knight and Kyshona Knight have announced their international retirement
All four were part of the 2016 T20 World Cup-winning squad
— ESPNcricinfo (@ESPNcricinfo) January 19, 2024
మీడియం పేసర్ అయిన సెల్మన్ 2008లో వన్డేల్లో అరంగేట్రం చేసింది. 100 వన్డేల్లో 82 వికెట్లు, 96 టీ20ల్లో 51 వికెట్లు పడగొట్టింది. చివరిసారిగా నిరుడు ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన టీ20 వరల్డ్ కప్లో సెల్మన్ విండీస్ జెర్సీ వేసుకుంది.
నైట్ సిస్టర్స్, అనిశా, శకేర
ఇక కవలలు అయిన కిసియా, కిషోనలు రెండేండ్ల తేడాతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. వికెట్ కీపర్, బ్యాటర్గా రాణించిన కిసియా 87 వన్డేల్లో 1,327 పరుగులు, 70 టీ20ల్లో 801 రన్స్ కొట్టింది. మిడిలార్డర్ బ్యాటర్ అయిన కిషోన 51 వన్డేల్లో 851 రన్స్, 55 టీ20ల్లో 546 పరుగులు చేసింది. ఈ ట్విన్ సిస్టర్స్ దేశం తరఫున 2022 డిసెంబర్లో చివరి మ్యాచ్ ఆడేశారు.