టీమిండియా చరిత్రలో 100 టెస్టులు పూర్తిచేసుకున్న ఆటగాళ్ల క్లబ్లో చేరడానికి మోడర్న్ క్రికెట్ గ్రేట్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ పరుగుల యంత్రం గురించి మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ తదితరులు మాట్లాడారు. వందో టెస్టు ఆడనున్న అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో ఉంచింది. ఈ వీడియోలో ఎవరెవరు ఏమన్నారంటే..?
‘‘నీ గురించి నేము మొట్టమొదట విన్నది 2007 (2008)లో మేమంతా ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అనుకుంటా. అప్పుడు మీరు మలేషియాలో అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్నారు. అప్పుడే కొందరు ప్లేయర్లు ‘ఈ ఆటగాడిని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు’ అంటూ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత మనిద్దరం కలిసి ఇండియాకు ఆడాం. మరీ ఎక్కువ కాలం ఆడకపోయినా మనం కలిసి గడిపిన సమయంలోనే నువ్వు ఎంత బాగా కొత్త విషయాలు నేర్చుకుంటావో అర్థమైపోయింది.
నీ ఆటపై చాలా మరింత శ్రమించాలని, మరింత మెరుగవ్వాలనే నీ కోరిక నాకు తెలుసు. ఫిట్నెస్ విషయంలో మాత్రం నువ్వు అత్యద్భుతమైన రోల్ మోడల్గా మారావ్’’ అంటూ సచిన్ టెండూల్కర్ మెచ్చుకున్నాడు. సచిన్ 2013లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అప్పటికి కోహ్లీ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారాడు. క్రికెట్ చరిత్రలో 200 టెస్టులు ఆడిన ఏకైక ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఒక్కడే.
‘‘100 టెస్టులు ఆడటం అంత సులభం కాదు. టెస్ట్ క్రికెట్ కూడా సులభం కాదు. ఒక్క టెస్టు ఆడటమే గొప్ప, అలాంటిది వంద టెస్టులు ఆడటం అంటే అద్భుతమైన అచీవ్మెంట్ అది. దీన్ని చూసి కోహ్లీ కచ్చితంగా గర్వపడొచ్చు. అతను మొదటి టెస్టు ఆడే సమయంలో నేను అతనితో కలిసి ఆడా. గడిచిన పది సంవత్సరాల్లో అతని ఎదిగిన తీరు అద్భుతం. ఒక క్రికెటర్గా, ఒక వ్యక్తిగా అతను చాలా ఎదిగాడు. జట్టును చాలా కాలాం తన భుజాలపై మోశాడు. ఆడిన పదేళ్లలో ఐదారేళ్లుగా కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రతిసారీ సత్తా చాటాడు.
100 టెస్టు మ్యాచుల్లో 50 పైగా సగటు మెయిన్టెయిన్ చేయడం మాటలు కాదు. భారత అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడైన అతనికి ఇదో అద్భుతమైన విజయం. అతని ఫిట్నెస్, అతను ఎక్కడున్నాడో ఒకసారి చూస్తే చాలు.. అతను ఇంకా చాలా సాధిస్తాడని, ఇప్పటి వరకు చేసిన దానితో సంతృప్తి చెందడని అర్థమవుతుంది’’ అని ప్రస్తుత టీమిండియా కోచ్ ద్రావిడ్ అన్నాడు. సచిన్ తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన భారతీయ ఆటగాడు ద్రావిడే. అతను 164 మ్యాచులు ఆడాడు.
భారత జట్టుకు 113 టెస్టు మ్యాచుల్లో ప్రాతనిధ్యం వహించిన మాజీ సారధి, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ.. ‘‘విరాట్ అద్భుతమైన ప్రయాణం సాగించాడు. 10-11 ఏళ్ల క్రితం ప్రారంభమై ఇప్పుడున్న స్థానానికి చేరుకోవడం ఒక గొప్ప విజయం. బీసీసీఐ అధ్యక్షుడిగా, అలాగే 100పైగా టెస్టులు ఆడిన ఒక ఆటగాడిగా, మాజీ కెప్టెన్గా అతనికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అతని కెరీర్ చాలా ఫాంటాస్టిక్గా ఉంది. అంతేకాదు, ఇంకా చాలా మైలురాళ్లు సాధించే సత్తా అతనికి ఉంది. అవన్నీ అతను సాధించాలని కోరుకుంటున్నా. అతనికి, అతని కుటుంబానికి, కోచ్కు, అతని కెరీర్లో పాలుపంచుకున్న ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నాడు.
ఈ వీడియోలో పేసర్ ఇషాంత్ శర్మ కూడా కనిపించాడు. కోహ్లీ కెప్టెన్సీలో ఇషాంత్ తన 100వ టెస్టు ఆడాడు. కోల్కతాలో జరిగిన ఇది భారత్లో ఆడిన తొలి పింక్బాల్ టెస్టు కూడా. అలాగే భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన తొలి ఢిల్లీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్, మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్, మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ అందరూ కోహ్లీని అభినందించారు.
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!
Welcome to the 1⃣0⃣0⃣-Test club Virat Kohli 👏 👏#TeamIndia greats share their thoughts on @imVkohli's landmark Test, his achievements & the impact he's had on Indian cricket. 🔝 👍
Watch the full feature 🎥 🔽https://t.co/m135xwB2zt pic.twitter.com/gzN71BZnCn
— BCCI (@BCCI) March 2, 2022