హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డి గతంలో టీడీపీలో పనిచేశారని, బాలకృష్ణ తరహాలో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.
రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ రాజకీయ డ్రామాలు ఆడుతున్నదని ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఎక్కువసార్లు సవరించింది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. మైనార్టీలకు ప్రాధాన్యమిచ్చి, ఎస్టీలు, బీసీలకు అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు ఆరు గ్యారెంటీలు, యూత్ డిక్లరేషన్ గుర్తుకు రావడమే లేదని ఆరోపించారు.