ఆసియా కప్లో ఫేవరెట్లుగా బరిలో దిగిన భారత జట్టు సూపర్-4 దశలో వరుస ఓటములు చవిచూసి ఇంటిదారి పట్టింది. చివరి మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్పై 101 పరుగుల తేడాతో భారీ విజయం సాధించినప్పటికీ.. జట్టులో చేసిన ప్రయోగాలే టీమిండియాను బాగా దెబ్బతీశాయి. దీనిపై పలువురు మాజీలు, విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఈ జాబితాలో మాజీ చీఫ్ సెలెక్టర్, లెజెండరీ ప్లేయర్ దిలీప్ వెంగ్సర్కార్ కూడా చేరాడు. ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా సారధి రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్పై వెంగ్సర్కార్ మండిపడ్డాడు. ‘జట్టులో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. దినేష్ కార్తీక్ను తీసుకున్నారు కానీ అతన్ని ఆడించలేదు. చివరకు శ్రీలంకపై అశ్విన్ను ఆడించారు.
అందరికీ అవకాశాలు ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ ప్రయత్నిస్తోంది. తద్వారా వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం బెస్ట్ ఆటగాళ్లను ఎంచుకోవాలని అనుకుంటోంది. కానీ ఈ టోర్నీ కూడా ముఖ్యమే కదా. ఆసియా కప్ ఒక పెద్ద టోర్నమెంట్. ఇలాంటి వాటిలో మ్యాచులు గెలవడం జట్టుకు చాలా ముఖ్యం. దీని వల్ల వారి ఉత్సాహం పెరుగుతుంది. గెలుపు కోసం రకరకాల కాంబినేషన్లు ట్రై చేయొచ్చు కానీ.. అంతగా కావాలంటే ద్వైపాక్షిక సిరీసుల్లో ఈ ప్రయోగాలు చేసుకోవాలి.
అంతేకానీ ఆసియా కప్, ప్రపంచకప్లలో ప్రయోగాలు చేస్తారా? ఇవి చాలా పెద్ద టోర్నమెంట్లని తెలీదా? ఇలాంటి టోర్నీల్లో గెలవడం చాలా ముఖ్యం’ అని వెంగ్సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియా కప్ నుంచి నిష్క్రమించిన డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా.. వచ్చే నెల రోజుల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీసులు ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రపంచకప్ కోసం అక్కడకు చేరుకుంటుంది.