కొలంబో: ఆసియాకప్లో భాగంగా ఆదివారం ఇండియా, పాకిస్థాన్(Ind Vs Pak) మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయిన విషయం తెలిసిందే. నిన్న వర్షం పడే సమయానికి ఇండియా 24.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 రన్స్ చేసింది. ప్రస్తుతం క్రీజ్లో కేఎల్ రాహుల్, కోహ్లీ ఉన్నారు. ఇవాళ ఆ పాయింట్ నుంచే మళ్లీ మ్యాచ్ స్టార్ట్ కానున్నది. అయితే ఇవాళ ఉదయం కూడా కొలంబోలో జల్లులు కురిశాయి. మైదానం ఇంకా చిత్తడిగానే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త మబ్బులు తొలుగుతున్నట్లు వెదర్ అప్డేట్ వస్తోంది. ఒకవేళ మ్యాచ్ జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది, లేదా మ్యాచ్ రద్దు అయితే ఇండియా పరిస్థితి ఏంటో తెలుసుకుందాం.
గ్రూప్ 4 స్టేజ్లో అర్హత సాధించిన అన్ని జట్లు.. పరస్పరం తలబడనున్నాయి. ప్రస్తుతం పాక్, శ్రీలంక జట్లు రెండేసి పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉన్నాయి. పాక్ జట్టు (+1.051) ఉత్తమ రన్రేట్తో లంక(+0.420) కన్నా మెరుగైన స్థానంలో ఉంది. ఇక ఈ స్టేజ్లో ఇండియా ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. పాక్తోనే గ్రూప్ 4 స్టేజ్లో తొలి మ్యాచ్ ఇండియా ఆడింది. -0.749 రన్రేటుతో బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు ఇక ఫైనల్ అర్హత కోల్పోయింది.
ఇవాళ రిజర్వ్ డే సందర్భంగా జరిగే మ్యాచ్ ఒకవేళ మళ్లీ రద్దు అయితే, అప్పుడు రెండు జట్లకు పాయింట్లను పంచుతారు. పాయింట్లను షేర్ చేయడం వల్ల పాకిస్థాన్ 3 పాయింట్లకు చేరుకుంటుంది. ఇండియా ఒక్క పాయింట్తో మూడవ స్థానంలో ఉంటుంది. ఒకవేళ ఇవాళ మ్యాచ్ వర్షార్పణమైతే, తర్వాత రెండు మ్యాచ్లను ఇండియా కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక పాయింట్తో శ్రీలంక మన కన్నా బెటర్ ప్లేస్లో ఉంది. బంగ్లా, శ్రీలంకతో తన తదుపరి మ్యాచ్లను ఇండియా ఆడనున్నది.