Farmers Cricket | రైతులు అనగానే చేత్తో నాగలి పట్టి, పొలం దున్ని, పంటలు పండిస్తారు అని అందరూ భావిస్తారు. మరి అలాంటి రైతులు క్రికెట్ ఆడితే.. స్టేడియం అదిరిపోయింది. పిచ్ వణికిపోయింది. బ్యాట్లకు చెమటలు పట్టాయి. బౌండరీల వర్షం కురిపిస్తుంటే బౌలర్లకు చుక్కలు కనిపించాయి.
రోజు ప్రేక్షకుల మాదిరిగా ఉండే రైతులు.. క్రికెట్ బ్యాట్ పట్టి దుమ్మురేపారు. మేము సైతం అంటూ బరిలోకి దిగి ఫోర్లు, సిక్స్లతో హోరెత్తించారు. పచ్చటి పంట పొలాల మధ్య పరుగుల వరద పారించారు. యువకులతో పోటీపడి ఆడిన అన్నదాతలు కుర్రకారును ఓడించినంత పని చేశారు.
ఈ ఆసక్తికరమైన మ్యాచ్కు ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలంలోని లాల్ పిచ్ గ్రౌండ్ వేదికైంది. రైతులు, ఎస్ఎస్ జట్ల మధ్య హోరా హోరీగా సాగిన పోరులో 7 పరుగుల తేడాతో రైతన్న టీం ఓడిపోయింది. యువకులు 60 పరుగులు చేయగా, అన్నదాతలు 53 పరుగులు చేశారు. అయితేనేం ఈ మ్యాచ్ లగాన్ సినిమాను తలపించింది అంటే అతిశయోక్తి కాదు. రైతన్న టీం కెప్టెన్ రావుల శంకర్ మాట్లాడుతూ.. యువకులతో కలిసి ఈ టోర్నమెంటులో పాల్గొనడం మాకు గర్వంగా ఉందన్నారు.