న్యూఢిల్లీ : ప్రజల పట్ల సానుభూతి లేని పాలకులతో దేశం విలవిలలాడుతోందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శుక్రవారం మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుతుండగా ప్రజలను కాపాడటంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సోనియా గాంధీ మాట్లాడుతూ ప్రజల పట్ల ప్రస్తుత దేశ రాజకీయ నాయకత్వానికి సానుభూతి కొరవడటంతోనే ఈ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొవిడ్-19 సంక్షోభాన్ని అధిగమించేందుకు సమర్ధ, ముందుచూపుతో కూడిన నాయకత్వం అవసరమని అన్నారు. అసమర్థ సర్కార్ నాయకత్వంలో దేశం మునిగిపోతోందని వ్యాఖ్యానించారు. దేశంలో కొవిడ్-19 పరిస్థితిపై చర్చించేందుకు సత్వరమే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కరోనా మహమ్మారిపై రాజకీయాలకు అతీతంగా మనమంతా ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందని సోనియా పిలుపు ఇచ్చారు.