WTC | సుదీర్ఘ ఫార్మాట్లో విశ్వ విజేతను తేల్చే మహాసంగ్రామానికి సమయం ఆసన్నమైంది. ఐసీసీ రెండేండ్లకోసారి నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఓవల్ వేదికగా ప్రారంభం కానున్న మెగా పోరులో ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. క్రితం సారి తుది మెట్టుపై బోల్తాకొట్టి రన్నరప్తో సరిపెట్టుకున్న భారత్.. ఈ సారి టెస్టు గద చేజిక్కించుకోవాలని తహతహలాడుతుంటే.. దీటుగా బదులిచ్చేందుకు కంగారూలు రెడీ అయ్యారు.
లండన్: వేసవిలో పొట్టి ఫార్మాట్ మజా ఆస్వాదించిన అభిమానులు ఇక టెస్టు మోడ్లోకి మారిపోతున్నారు. బుధవారం నుంచి ఓవల్ వేదికగా.. భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుంది. 2021-23 సర్కిల్లో నిలకడైన ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఆసీస్, భారత్ ఐసీసీ గద కోసం పోటీపడుతున్నాయి. ఈ రెండేళ్ల కాలంలో ఆరు టెస్టు సిరీస్లు ఆడిన టీమ్ఇండియా కేవలం ఒక్కదాంట్లో మాత్రమే పరాజయం పాలైంది. ప్రతిష్ఠాత్మక బోర్డర్ గవాస్కర్తో పాటు ఎన్నో మరపురాని విజయాలను సొంతం చేసుకుంది. బలాబలాల పరంగా ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తుండటంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమే. 2021లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియా ఈ సారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఓవల్ పిచ్ స్వింగ్కు సహకరించనున్న నేపథ్యంలో ఆసీస్ బౌలర్లను మన టాపార్డర్ ఎలా ఎదుర్కొంటుందనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. కెప్టెన్ రోహిత్తో పాటు టెస్టుల్లో అపార అనుభవం ఉన్న చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే కీలకం కానున్నారు.
సౌతాంప్టన్ వేదికగా జరిగిన గత ఫైనల్లో భారత్ జట్టు కూర్పు విషయంలోనే దెబ్బతింది. న్యూజిలాండ్తో జరిగిన పోరులో ఇద్దరు స్పిన్నర్లను ఎంపిక చేసుకున్న టీమ్ఇండియా అందుకు మూల్యం చెల్లించుకుంది. ఈసారి ఎలాంటి తుది జట్టుతో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరం. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాపై భారత్దే పైచేయి అయినా.. ఐసీసీ ట్రోఫీ అంటే చెలరేగిపోయే కంగారూలను తక్కువ అంచనా వేయడానికి లేదు. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ మంచి టచ్లో ఉన్నా.. కెప్టెన్ రోహిత్ శర్మ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. మొత్తం జట్టులో ఐపీఎల్కు దూరంగా ఉండి.. కౌంటీ క్రికెట్ ఆడిన చతేశ్వర్ పుజరా మూడో స్థానంలో కీలకం కానున్నాడు. కోహ్లీ నాలుగో ప్లేస్లో బరిలోకి దిగనుండగా.. ఐపీఎల్ మెరుపులతో తిరిగి జట్టులోకి వచ్చిన అజింక్యా రహానే, రవీంద్ర జడేజాతో మిడిలార్డర్ బలంగా ఉంది. రెగ్యులర్ కీపర్ రిషబ్ పంత్ గాయపడటంతో అతడి స్థానంలో కేఎస్ భరత్ను ఆడిస్తారా.. ఇషాన్ కిషన్ వైపు మొగ్గుచూపుతారా అనేది చూడాలి. నలుగురు పేసర్లు ఉంటే ఇషాన్ను తీసుకోవడమే మంచిదని మాజీలు సూచిస్తుండగా.. ఓవల్లో స్పిన్నర్లు కూడా ప్రభావం చూపొచ్చని మరికొందరు అంటున్నారు. సిరాజ్, షమీ, ఉమేశ్తో బౌలింగ్ బలంగా ఉన్నా.. వీరంతా సమిష్టిగా సత్తాచాటాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన గత నాలుగు టెస్టు సిరీస్ల్లోనూ భారత్ విజయం సాధించింది. స్వదేశంలో 2, కంగారూ గడ్డపై రెండు నెగ్గింది.
జూన్ నెలలో ఇక్కడ టెస్టు మ్యాచ్ జరుగనుండటం ఇదే తొలిసారి. ఓవల్ వికెట్పై పచ్చిక కనిపిస్తున్నది. అయితే 2012 నుంచి ఇక్కడ స్పిన్నర్లే ఎక్కువ ప్రభావం చూపారని గణాంకాలు చెబుతున్నాయి. మ్యాచ్కు వర్షం ముప్పులేదు. అయితే ఇంగ్లండ్లో వాతావరణాన్ని అంచనా వేయడం కష్టం. అనివార్య కారణాల వల్ల ఐదురోజుల్లో ఏ రోజైనా మ్యాచ్ సాగకపోతే.. రిజర్వ్ డే (జూన్12) ఉంది.
పుష్కర కాలంగా ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోవాలని ఎదురుచూస్తున్న టీమ్ఇండియాకు.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రూపంలో చక్కటి అవకాశం దక్కింది. 2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత్.. ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవ లేకపోయింది. 2015, 19 వన్డే ప్రపంచకప్లతో పాటు 2016, 2021, 2022 టీ20 ప్రపంచకప్లలో నిరాశ పరిచింది. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినా.. న్యూజిలాండ్ చేతిలో ఓడి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సారి రోహిత్శర్మ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న టీమ్ఇండియా ఆ లోటును తీర్చుకోవాలని చూస్తున్నది. టెస్టు క్రికెట్లో చక్కటి ప్రదర్శన చేస్తున్న భారత్ గద అందుకుంటే.. సుదీర్ఘ ఫార్మాట్ మనుగడకు మంచిదని క్రికెట్ దిగ్గజాలు ఆకాంక్షిస్తున్నారు.
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, పుజారా, కోహ్లీ, రహానే, జడేజా, భరత్/ఇషాన్, అశ్విన్/శార్దూల్, ఉమేశ్, షమీ, సిరాజ్.
ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఖవాజా, లబుషేన్, స్మిత్, హెడ్, గ్రీన్, కారీ, స్టార్క్, లియాన్, బోలాండ్.