ఢిల్లీ: కొత్త సీజన్ను భారత షూటర్లు ఘనంగా ఆరంభించారు. ఢిల్లీలోని కర్ణిసేన షూటింగ్ రేంజ్లో బుధవారం నుంచి మొదలైన ఆసియా రైఫిల్, పిస్టోల్ చాంపియన్షిప్లో మొదటిరోజే పతకాల పంట పండించారు. హైదరాబాదీ యువ షూటర్ ఇషా సింగ్.. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ వ్యక్తిగత ఈవెంట్తో పాటు టీమ్ ఈవెంట్లోనూ సత్తాచాటి భారత్కు డబుల్ గోల్డ్ మెడల్స్ అందించడంలో కీలకపాత్ర పోషించింది.
ముందుగా వ్యక్తిగత విభాగంలో నిరుటి ఫామ్ను కొనసాగిస్తూ ఫైనల్లో 239.8 పాయింట్లు స్కోరు చేసి పసిడి కొట్టింది. చైనీస్ తైపీ షూటర్లు చెంగ్ యెన్-చింగ్ (235.4) రజతం నెగ్గగా యు ఐ-వెన్ (217.7) కాంస్యం సొంతం చేసుకుంది. సురుచి సింగ్ నాలుగో స్థానంలో నిలువగా డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇదే విభాగపు టీమ్ ఈవెంట్లో సురుచి, మనూ, ఇషా త్రయం 1,726 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా వియత్నాం (1,713), చైనీస్ తైపీ (1,711) వరుసగా రజతం, కాంస్యం సాధించాయి.
పురుషుల విభాగానికి వస్తే నిరుడు అద్భుత ప్రదర్శనతో సత్తాచాటిన వరల్డ్ చాంపియన్ సామ్రాట్ రాణా.. 220.3 పాయింట్లతో కాంస్యం నెగ్గాడు. ఉజ్బెకిస్థాన్కు చెందిన వ్లాదిమిర్ స్వెచ్నికోవ్ (242) అగ్రస్థానంలో నిలువగా కజకిస్థాన్ షూటర్ వాలెరీ రఖిమ్జన్ (241) రెండో స్థానంతో సిల్వర్ గెలిచాడు. ఇదే క్యాటగిరీ టీమ్ ఈవెంట్లో భారత త్రయం సామ్రాట్, శ్రవణ్, వరుణ్.. 1,732 పాయింట్లతో రజతాన్ని సాధించింది. ఉజ్బెకిస్థాన్ గోల్డ్, కజకిస్థాన్ కాంస్యం గెలిచాయి.