కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్లోని మిగతా మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. రెండోదశలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడతారా? లేదా? అన్న విషయం అనుమానంగా మారింది. మరోవైపు ఇంగ్లాండ్ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడకపోవచ్చని తెలుస్తోంది. ఐపీఎల్ సెకండాఫ్ జరిగే సెప్టెంబర్ 19 లేదా 20న బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తనున్నామని, ఆ తర్వాత పాకిస్థాన్తో సిరీస్లో పాల్గొనాల్సి ఉందని ఈసీబీ డైరెక్టర్ ఆష్లే గిల్స్ స్పష్టం చేశారు.
తమ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడేందుకు పంపమని ఇంగ్లాండ్ బోర్డు ఇప్పటికే వెల్లడించింది.
ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఒకవేళ మోర్గాన్ అందుబాటులో లేకపోతే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను మళ్లీ దినేశ్ కార్తీక్కు అప్పగించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కార్తీక్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. గత సీజన్ మధ్య వరకు దినేశ్ కోల్కతాకు కెప్టెన్గా వ్యవహరించాడు. జట్టు వరుస పరాజయాల నేపథ్యంలో అతణ్ని
సారథిగా తప్పించారు. ఐతే కోల్కతా యాజమాన్యం కార్తీక్కే మళ్లీ పగ్గాలు అప్పగిస్తుందా లేక కొత్త వారికి ఛాన్స్ ఇస్తుందో చూడాలి.