ధర్మశాల: వన్డే ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ బోణీ కొట్టింది. గత మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్న ఇంగ్లిష్ టీమ్ మంగళవారం బంగ్లాదేశ్పై భారీ విజయం సాధించింది. డబుల్ హెడర్లో భాగంగా జరిగిన తొలి పోరులో ఇంగ్లండ్ 137 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలన్ (107 బంతుల్లో 140; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో విజృంభించగా.. జానీ బెయిర్స్టో (52; 8 ఫోర్లు), జో రూట్ (81; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలు సాధించారు.
ఈ ముగ్గురి దెబ్బకు ఒక దశలో ఇంగ్లిష్ టీమ్ 266/1తో అత్యంత పటిష్ట స్థితిలో నిలిచి మరింత భారీ స్కోరు చేసేలా కనిపించినా.. మిడిలార్డర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 4, షరీఫుల్ ఇస్లామ్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లా.. 48.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (76; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ముష్ఫికర్ రహీమ్ (51) పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ షకీబ్ (1), తన్జీద్ (1), నజ్ముల్ (0), మెహదీ హసన్ మిరాజ్ (8) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లే 4, వోక్స్ రెండు వికెట్లు పడగొట్టారు. మలన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.