బ్యాటింగ్లో ప్రభావం చూపలేకపోయిన భారత్.. బౌలింగ్లోనూ అదే పేలవ ఆటతీరు కొనసాగించింది. మన బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాల్సింది పోయి.. అలవోకగా బౌండ్రీలు సమర్పించుకుంటూ.. ఇంగ్లిష్ బ్యాట్స్మెన్కు ఇతోధిక సాయం చేశారు. లార్డ్స్లో భారత ఆటగాళ్లలో కనిపించిన కసి.. లీడ్స్లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ కొనసాగిస్తే.. మనవాళ్లు రోజంతా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయారు. ఓపెనర్లు వేసిన పునాదిపై జో రూట్ హ్యాట్రిక్ సెంచరీతో మరో అద్భుత సౌధం నిర్మించగా.. మూడేండ్ల తర్వాత ఆడిన తొలి టెస్టులోనే డేవిడ్ మలన్ క్లాసిక్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఆఖరి సెషన్లో ఐదు వికెట్లు పడగొట్టిన భారత్.. శుక్రవారం ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో పాటు నిఖార్సైన టెస్టు ఇన్నింగ్స్ ఆడుతుందా చూడాలి!
లీడ్స్: బౌలర్ల అద్భుత ప్రదర్శనకు బ్యాట్స్మెన్ అద్వితీయ పోరాటం తోడవడంతో భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ పటిష్ట స్థితికి చేరింది. కెప్టెన్ జో రూట్ (165 బంతుల్లో 121; 14 ఫోర్లు) వరుసగా మూడో సెంచరీ నమోదు చేసుకోగా.. టాపార్డర్లో మరో ముగ్గురు అర్ధశతకాలతో మెరవడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. రోరి బర్న్స్ (61), హసీబ్ హమీద్ (68), డేవిడ్ మలన్ (70) ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. చేతిలో రెండు వికెట్లు ఉన్న ఇంగ్లండ్ ప్రస్తుతం 345 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రెయిగ్ ఓవర్టన్ (24), రాబిన్సన్ (0) క్రీజులో ఉన్నారు. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తుండగా.. భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో ఎలా పోరాడుతుందనేది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం తొలి సెషన్లో ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో పాటు వీలైనంత ఎక్కువసేపు క్రీజులో నిలువగలిగితేనే టీమ్ఇండియాకు ఈ మ్యాచ్లో అవకాశాలు ఉంటాయి!
ఓపెనర్లు ఔటైనా..
ఓవర్నైట్ స్కోరు 120/0తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ ఓపెనర్లను భారత బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. ఆడుతూ పాడుతూ పరుగులు చేస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఆరంభం నుంచి లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడిన షమీ ఎట్టకేలకు రోరి బర్స్స్ (153 బంతుల్లో 61; 6 ఫోర్లు, 1 సిక్సర్)ను ఔట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. దీంతో తొలి వికెట్కు 135 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికి మరో ఓపెనర్ హసీబ్ హమీద్ (195 బంతుల్లో 68; 12 ఫోర్లు)ను జడేజా వెనక్కి పంపాడు. తొలి సెషన్లో రెండు వికెట్లు పడటంతో భారత బౌలర్లలో కాస్త ఉత్సాహం నింపినా.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మనవాళ్ల ఆశలపై నీళ్లు చల్లాడు. సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ.. క్రీజులో అడుగుపెట్టడంతోనే బౌండ్రీలతో విరుచుకుపడ్డాడు. అతడికి పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ డేవిడ్ మలన్ చక్కటి సహకారం అందించాడు. ఫలితంగా మరో వికెట్ కోల్పోని ఇంగ్లండ్.. 182/2తో తొలి సెషన్ను ముగించింది.
పూర్తి ఆధిపత్యం..
లంచ్ తర్వాత జడేజాకు రెండు ఫోర్లతో స్వాగతం పలికిన ఇంగ్లిష్ కెప్టెన్.. ఇన్నింగ్స్ ఆసాంతం అదే జోరు కొనసాగించాడు. ఎలాంటి తడబాటుకు అవకాశమివ్వకుండా.. భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ క్రీజులో పాతుకుపోయాడు. అలా అని జిడ్డు బ్యాటింగ్తో విసిగించకుండా.. వన్డే తరహాలో వేగంగా ఆడాడు. మలన్ కంటే చాలా ఆలస్యంగా క్రీజులోకి వచ్చిన రూట్.. చూస్తుండగానే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 57 బంతుల్లోనే రూట్ ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడంటే అతడి ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కాసేపటికే మలన్ కూడా హాఫ్సెంచరీ తన పేరిట రాసుకున్నాడు. మూడేండ్లుగా పరిమిత ఓవర్లకే పరిమితమైన మలన్ ఆడిన తొలి టెస్టులోనే చక్కటి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ జోడీ క్రీజులో పాతుకుపోవడంతో.. భారత బౌలర్లు లయ తప్పారు. కట్టుదిట్టమైన బంతులు వేయాల్సింది పోయి.. వరుసపెట్టి బౌండ్రీలు సమర్పించుకున్నారు. 80 ఓవర్ల అనంతరం భారత బౌలర్లు కొత్త బంతి తీసుకున్న పెద్దగా ప్రయోజనం లేకపోయింది. రూట్, మలన్ ధాటిగా ఆడుతుంటే.. కేవలం బంతిని అందించేందుకే ఫీల్డర్లు ఉన్నది అన్న రీతిలో ఇంగ్లండ్ జోరు కొనసాగించారు. మూడో వికెట్కు 139 పరుగులు జోడించాక ఎట్టకేలకు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ జోడీని విడదీశాడు. లెగ్స్టంప్కు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడిన మలన్.. పంత్ పట్టిన చురుకైన క్యాచ్కు వెనుదిరిగాడు. మొదట అంపైర్ నాటౌట్ అని ప్రకటించినా.. విరాట్ కోహ్లీ రివ్యూ కోరి ఫలితం సాధించాడు. ఈ వికెట్తోనే ఇంగ్లండ్ టీ విరామానికి వెళ్లింది. తొలి సెషన్లో 62 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లడ్.. రెండో సెషన్లో పరుగుల వేగం పెంచింది. ఏకంగా 116 పరుగులు చేసి కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోవడం గమనార్హం.
మూడో సెషన్.. చెరి సగం
అప్పటికే జోరుమీదున్న రూట్.. మూడో సెషన్ ఆరంభంలోనే వరుస బౌండ్రీలతో విరుచుకుపడి సిరీస్లో వరుసగా మూడో శతకం తన పేరిట రాసుకున్నాడు. టెస్టు క్రికెట్లో రూట్కు ఇది 23వ శతకం కాగా.. ఈ క్యాలెండర్ ఇయర్లో ఆరోది. ఇంగ్లండ్ తరఫున ఒకే ఏడాదిలో ఆరు సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగాను రూట్ రికార్డుల్లోకెక్కాడు. గతంలో డేనిస్ కాంప్టన్ (1947), మైఖేల్ వాన్ (2002) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఓవైపు రూట్ క్రీజులో పాతుకుపోతే.. మరో ఎండ్లో జానీ బెయిర్స్టో (29) వేగంగా పరుగులు రాబట్టాడు. బట్లర్ (7) ఎక్కువసేపు నిలువలేకపోగా.. ఎట్టకేలకు బుమ్రా బౌలింగ్లో రూట్ ఔటయ్యాడు. ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్క పేలవ షాట్ కూడా ఆడని రూట్ను.. బుమ్రా చక్కటి బంతితో పెవిలియన్ బాట పట్టించాడు. మొయిన్ అలీ (8) పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. సామ్ కరన్ (15), ఓవర్టన్ (24 బ్యాటింగ్) విలువైన పరుగులతో ఆధిక్యాన్ని మరింత పెంచారు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 78 ఆలౌట్,
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (బి) షమీ 61, హమీద్ (బి) జడేజా 68, మలన్ (సి) పంత్ (బి) సిరాజ్ 70, రూట్ (బి) బుమ్రా 121, బెయిర్స్టో (సి) కోహ్లీ (బి) షమీ 29, బట్లర్ (సి) ఇషాంత్ (బి) షమీ 7, అలీ (సి) (సబ్) అక్షర్ (బి) జడేజా 8, కరన్ (సి) (సబ్) మయాంక్ (బి) సిరాజ్ 15, ఓవర్టన్ (నాటౌట్) 24, రాబిన్సన్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 20, మొత్తం: 423/8.
వికెట్ల పతనం: 1-135, 2-159, 3-298, 4-350, 5-360, 6-383, 7-383, 8-418, బౌలింగ్: ఇషాంత్ 22-0-92-0, బుమ్రా 27-10-58-1, షమీ 26-7-87-3, సిరాజ్ 23-3-86-2, జడేజా 31-7-88-2.