సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్లో ఆస్ట్రేలియా.. సెమీఫైనల్కు చేరకుండానే వెనుదిరిగింది. గ్రూప్-నుంచి ఇప్పటికే న్యూజిలాండ్ సెమీస్ చేరగా.. చివరి లీగ్ మ్యాచ్లో శ్రీలంకపై నెగ్గిన ఇంగ్లండ్ సెమీస్కు అర్హత సాధించడంతో ఆసీస్ చాన్స్లకు తెరపడింది.
సిడ్నీ: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్.. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన గ్రూప్-1 చివరి పోరులో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ విజయంతో ఆస్ట్రేలియాతో సమానంగా 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఇంగ్లండ్.. మెరుగైన రన్రేట్ కారణంగా ముందంజ వేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఓపెనర్ నిశాంక (67; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆదిల్ రషీద్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 144 రన్స్ చేసింది. అలెక్స్ హేల్స్ (47), బెన్ స్టోక్స్ (42 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో లహిరు కుమార, హసరంగ, ధనంజయ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రషీద్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.