ఇటీవలే గుండెపోటుతో కన్నుమూసిన ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కు లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ఆటగాళ్లతో పాటు ఆట చూడటానికి వచ్చిన ప్రేక్షకులంతా ఘన నివాళి అర్పించారు. వార్న్ జెర్సీ నెంబర్ ను గుర్తుచేసేలా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 23వ ఓవర్లో వార్న్ కు నివాళి ఇచ్చారు. 23 సెకన్ల పాటు ఆటను ఆపి.. చప్పట్లతో వార్న్ కు నివాళి అర్పించారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 23వ ఓవర్ చేరగానే ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు స్టేడియంలో ప్రేక్షకులు అంతా తమ సీట్లలోంచి నిల్చున్నారు. టీవీ స్క్రీన్ మీద వార్న్ విశేషాలతో కూడిన 23 సెకన్ల వీడియోను ప్రదర్శించారు. ఆ సయమంలో ఆటగాళ్లు, ప్రేక్షకులు, పెవిలియన్ లో ఉన్న ఇరు జట్ల ప్లేయర్లు, కామెంటేటర్లు అంతా లేచి వార్న్ కు ఘనంగా నివాళి అర్పించారు.
ఈ ఏడాది మార్చి 4న వార్న్.. థాయ్లాండ్ లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. మార్చి 30న ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) లో వార్న్ కు లక్ష మంది అభిమానుల మధ్య ఘనమైన వీడ్కోలునిచ్చారు. సుమారు 15 ఏండ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వార్న్.. 145 టెస్టులలో 708 వికెట్లు, 194 వన్డే మ్యాచులలో 293 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో ముత్తయ్య మురళీధరన్ తర్వాత స్థానంలో వార్న్ ఉన్నాడు.
కాగా లార్డ్స్ లో జరుగుతున్న తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్ లో 132 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.