కొత్త సారధి.. కొత్త కోచ్.. కొత్త ఉత్సాహంతో లార్డ్స్ బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు.. న్యూజిల్యాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఇంగ్లిష్ బౌలర్లు చెలరేగడంతో కివీస్ జట్టు 132 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లండ్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. అయితే 92 పరుగుల వద్ద మాజీ కెప్టెన్ జోరూట్ అవుటవడంతో ఆ జట్టు పతనం మొదలైంది.
ఆ తర్వాత కేవలం 28 బంతుల వ్యవధిలో 8 పరుగులు చేసిన ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. ఇలా తొలిరోజు ఆటలోనే 17 వికెట్లు కూలడంపై ఇంగ్లండ్ మాజీ దిగ్గజాలు స్పందిస్తూ.. బౌలర్ల సత్తాను మెచ్చుకున్నారు. దీనిపై భారత జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ వెటకారమాడాడు.
‘‘లార్డ్స్లో మ్యాచ్లో ఒకేరోజు 17 వికెట్లు పడితే.. బౌలర్ల సత్తా గురించి మాట్లాడతారు. అదే అహ్మదాబాద్లో ఒక రోజులో 17 వికెట్లు కూలితే మాత్రం పరిస్థితుల గురించి చర్చ మొదలుపెడతారు’’ అంటూ సల్మాన్ ఖాన్ ఉన్న ఒక ఫొటో షేర్ చేశాడు. ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో కూడా ఇలాగే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 112 పరుగులకే చాపచుట్టేసింది.
ఆ తర్వాత 99/3 స్కోరుతో బలంగా కనిపించిన భారత్.. మరుసటి రోజు 145 పరుగులకు కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లండ్ మరింత ఘోరంగా 81 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ రోజు మొత్తమ్మీద 17 వికెట్లు కూలాయి. దాంతో స్పిన్ పిచ్ తయారు చేశారంటూ చాలామంది వెటరన్లు, ముఖ్యంగా ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు దుమ్మెత్తిపోశారు. దాని గురించే వసీం జాఫర్ చురకలేశాడు.
When 17 wkts fall in a day at Lord's, talk is about skills of the bowlers.
When 17 wkts fall in a day at Ahmedabad, talk is about conditions. #ENGvNZ pic.twitter.com/2sl4n26Cn3
— Wasim Jaffer (@WasimJaffer14) June 3, 2022