ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో కోహ్లీ స్వల్పస్కోరుకే అవుటయ్యాడు. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. మాథ్యూ పాట్స్ వేసిన బంతిని చివరి క్షణంలో వదిలేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. దీనిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ స్పందించాడు.
కోహ్లీది నిజంగా దురదృష్టమేనని స్వాన్ చెప్పాడు. క్రీజులో కోహ్లీ చాలా కంపోజ్డ్గా కనిపించాడని, అతని డిఫెన్స్ కూడా చాలా బలంగా ఉందని వివరించాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆగి, ఆగి ఆడటంతో అతని కాన్సన్ట్రేషన్ దెబ్బతిని ఉండొచ్చన్నాడు. ‘‘దీని గురించి కోహ్లీ అంత ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే పరుగులు చేయాలనే ఆకలి అతనిలో ఇంకా ఉంది.
అలా అనుకోకుండా అవుటైనప్పుడు కోహ్లీ ఎంత బాధ పడ్డాడో చూస్తేనే అది అర్థమవుతోంది. ఒక టాపార్డర్ బ్యాటర్ అవుటైనప్పుడు వాళ్లు మామూలుగా వెళ్లిపోతే.. అది కరెక్ట్ అని నేను అనుకోను. కోహ్లీ అలా చేయలేదు. ఈరోజు ఏదో సాధించాలని వచ్చాడతను. అందుకే అంత బాధ పడ్డాడు’’ అని స్వాన్ వివరించాడు.
అలాగే పంత్, జడేజా ఇన్నింగ్స్ చూసిన తర్వాత అతనిలో పరుగులు చేయాలనే తపన మరింత పెరిగి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు ఉన్న ఫామ్లో ఆ టీంను ఓడించాలంటే కచ్చితంగా రెండో ఇన్నింగ్స్లో కూడా భారత జట్టు భారీ స్కోరు చేయాల్సిందే. మరి కోహ్లీ రెండో ఇన్నింగ్స్లో అయినా సత్తా చాటుతాడేమో చూడాలి.