రెండో టీ20లో భారత జట్టు కష్టాల్లో పడింది. రోహిత్ (31) అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ (1) మరోసారి నిరాశపరిచాడు. ఆ మరుసటి బంతికే రిషభ్ పంత్ (26) కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలకెత్తుకున్న సూర్యకుమార్ యాదవ్ (15)ను జోర్డాన్ అవుట్ చేశాడు. 11వ ఓవర్ మూడో బంతిని పుల్ చేసేందుకు ప్రయత్నించిన సూర్యకుమార్ విఫలమయ్యాడు.
టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లో బాగా ఎత్తుగా లేచినప్పటికీ.. శామ్ కర్రాన్ దాన్ని అందుకోవడంతో సూర్యకుమార్ మైదానం వీడాడు. ఆ మరుసటి బంతికే హార్దిక్ పాండ్యా (12) కూడా అవుటయ్యాడు. జోర్డాన్ వేసిన బంతినే బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న మలాన్కు నేరుగా కొట్టిన పాండ్యా పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.