Rohit Sharma: ప్రపంచంలోనే దిగ్గజ క్రికెటర్లు.. బంతితో పాటు బ్యాట్తోనూ అద్భుతాలు చేయగల మెరుగైన ఆటగాళ్లు.. ప్రతిభకు కొదవలేదు.. పెట్టుబడికి రంధి లేదు.. అభిమానగణానికి అంతే లేదు.. కానీ ఒక్క ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడానికి ముంబై ఇండియన్స్ పడరాని పాట్లు పడింది. సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య, రికీ పాంటింగ్, రాబిన్ ఊతప్ప, ఆండ్రూ సైమండ్స్, వంటి బ్యాటర్లు.. లసిత్ మలింగ, షాన్ పొలాక్ వంటి బౌలర్లు ఉన్నా సచిన్, హార్భజన్, పాంటింగ్.. ఇలా సారథులు మారుతున్నా ఆ జట్టు ఐదేండ్ల పాటు ఐపీఎల్ ట్రోఫీ కోసం కండ్లు కాయలు కాసేలా చూసింది. 2008 నుంచి 2013 దాకా ఐదేండ్ల కాలంలో ముంబై ఫైనల్ చేరింది 2010 సీజన్లో మాత్రమే..
‘ఇక ముంబైకి ఐపీఎల్ ట్రోఫీ కలేనేమో..?’అని అభిమానులు భావిస్తున్న తరుణంలో ముంబైకి ‘ట్రంప్ కార్డు’లా దొరికాడు రోహిత్ శర్మ. తెలుగు మూలాలున్న ఈ నాగ్పూర్ క్రికెటర్.. ముంబై కీర్తిని ఐపీఎల్లో ఇతర జట్లు అందనంత ఎత్తుకు తీసుకెళ్లాడు. అతడి హయాంలో ముంబై ఏకంగా ఐదు ట్రోఫీలను నెగ్గి ఈ లీగ్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా నిలిచింది.
2011లో ఎంట్రీ..
2011లో జరిగిన వేలంలో ముంబైతో చేరిన రోహిత్.. 2013లో రికీ పాంటింగ్ నుంచి సారథ్య పగ్గాలు అందుకున్నాడు. సీజన్ మధ్యలోనే పాంటింగ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలు అందుకున్న రోహిత్.. తొలి ప్రయత్నంలోనే తానెంటో నిరూపించుకున్నాడు. ఐదేండ్లపాటు ముంబైకి కలగా మిగిలిన ఐపీఎల్ ట్రోఫీని.. షర్ట్ బటన్ వేసుకున్నంత ఈజీగా ముంబైకి అందించాడు. ఆ తర్వాత సీజన్లో కూడా ముంబైని ప్లేఆఫ్స్కు చేర్చిన రోహిత్ .. 2015, 2017లలోనూ ట్రోఫీలు అందించాడు. ఇక 2019, 2020లలో వరుసగా రెండు ట్రోఫీలను అందుకున్నాడు. గత సీజన్లో ముంబై ప్లేఆఫ్స్ చేరింది. మొత్తంగా రోహిత్ సారథ్యంలో ముంబై.. 158 మ్యాచ్లు ఆడి 87 మ్యాచ్లలో విజయాలు సాధించగా 67 ఓడింది. నాలుగు మ్యాచ్లు టై అయ్యాయి.
Ro,
In 2013 you took over as captain of MI. You asked us to 𝐁𝐞𝐥𝐢𝐞𝐯𝐞. In victories & defeats, you asked us to 𝘚𝘮𝘪𝘭𝘦. 10 years & 6 trophies later, here we are. Our 𝐟𝐨𝐫𝐞𝐯𝐞𝐫 𝐜𝐚𝐩𝐭𝐚𝐢𝐧, your legacy will be etched in Blue & Gold. Thank you, 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐑𝐎💙 pic.twitter.com/KDIPCkIVop— Mumbai Indians (@mipaltan) December 15, 2023
ముంబై తలరాతను మార్చి..
రోహిత్ సారథ్యంలో ముంబై తలరాత మారింది. గతంలో టాప్ ప్లేయర్లతో ఆశించిన ఫలితాలు రాబట్టడంలో విఫలమైన ముంబై.. ఆ తర్వాత యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. పలు మ్యాచ్లలో విఫలమైనా వారిపై నమ్మకముంచింది. జట్టులో ఆటగాడిగానే గాక సారథిగా కూడా రోహిత్.. ఆటగాళ్లతో కలిసిపోయాడు. హెడ్కోచ్ రికీ పాంటింగ్, మహేళ జయవర్దెనేలతో సమన్వయం చేసుకుంటూ జట్టును విజయవంతంగా నడిపించాడు. రోహిత్ హయాంలోనే ముంబై ఇండియన్స్ నుంచి హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్ వంటి క్రికెటర్లు అద్భుత ప్రదర్శనలతో భారత క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి జాతీయ జట్టులో కీలక ఆటగాళ్లుగా మారారు. గత రెండేండ్లుగా తిలక్ వర్మ, హృతిక్ షోకీన్, నెహల్ వధేరా, ఆకాశ్ మధ్వాల్ వంటి యువ ఆటగాళ్లను భవిష్యత్ స్టార్లుగా తీర్చిదిద్దడంలో రోహిత్ పాత్ర మరువలేనిది.
1⃣0⃣ Years, 6⃣ Trophies
1⃣ Mumbai Cha ℝ𝕒𝕛𝕒!𝐑𝐎𝐇𝐈𝐓 𝐒𝐇𝐀𝐑𝐌𝐀! 💙
Read more ➡️https://t.co/t3HIaC8C9f pic.twitter.com/Kt7FoBLJCI
— Mumbai Indians (@mipaltan) December 15, 2023
వచ్చే సీజన్ చివరిదా..?
ముంబై ఇండియన్స్ తాజాగా రోహిత్ను సారథ్య పగ్గాల నుంచి తప్పించి హార్ధిక్ పాండ్యాకు ఆ బాధ్యతలను అప్పజెప్పింది. పదేండ్ల పాటు ముంబైని నడిపించిన రోహిత్ను ఇలా తొలగించడం అతడి అభిమానులు జీర్ణించుకోలేనిదే అయినా భవిష్యత్ దృష్ట్యా ముంబై యాజమాన్యం పాండ్యాకు పగ్గాలు అప్పజెప్పింది. వయసు, ఫిట్నెస్ కారణాల రీత్యా రోహిత్.. రిటైర్మెంట్కు దగ్గరవుతున్న విషయం జగద్విదితమే. ఈ నేపథ్యంలో రోహిత్ 2024 సీజన్లో సారథ్య ఒత్తిడిని వదిలేసి పూర్తిస్థాయి బ్యాటర్గా బరిలోకి దిగనున్నాడు. ఈ సీజన్ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది ముంబై ఇండియన్స్ తో పాటు హిట్మ్యాన్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్న చేదు నిజం…! ఏదేమైనా రోహిత్ను సారథిగా తప్పించడంతో ముంబై ఇండియన్స్లో స్వర్ణ యుగం ముగిసినట్టేనని అతడి అభిమానులు వాపోతున్నారు. పదేండ్లుగా ముంబై అంటే రోహిత్.. రోహిత్ అంటే ముంబైగా సాగిన ప్రస్థానం నేటితో ముగిసింది.