కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ టెస్టు నాలుగవ రోజున టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికా రెండవ ఇన్నింగ్స్లో 21వ ఓవర్లో చోటుచేసుకున్న ఘటనతో అతను ఆవేశానికి లోనయ్యాడు. అశ్విన్ బౌలింగ్లో ఎల్గర్ ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. ఫీల్డ్ అంపైర్ అతన్ని ఔట్గా ప్రకటించాడు. అయితే ఎల్గర్ డీఆర్ఎస్ రివ్యూకు వెళ్లాడు. థార్డ్ అంపైర్ అతన్ని నాటౌట్గా ప్రకటించాడు. బంతి కాస్త వికెట్ల పైనుంచి వెళ్తున్నట్లు నిర్ధారణకు వచ్చిన థార్డ్ అంపైర్ ఎల్గర్ను నాటౌట్గా తేల్చాడు. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ కూడా కాస్త ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊగిపోయాడు. తన కోపాన్ని అణుచుకోలేకపోయాడు. స్టంప్స్ వద్దకు వెళ్లి మైక్లో తన ఆవేశాన్ని చెప్పేశాడు. మీ టీమ్ మీద కూడా ఫోకస్ చేయండి.. కేవలం ప్రత్యర్థుల్ని మాత్రమే కాదు అంటూ కోహ్లీ మైక్ వద్ద గట్టిగా అరిచాడు. ఇక అక్కడే ఉన్న కేఎల్ రాహుల్, అశ్విన్లు కూడా డీఆర్ఎస్ రివ్యూ పట్ల సీరియస్ అయ్యారు. పదకొండు మందికి వ్యతిరేకంగా మొత్తం దేశం ఉందని రాహుల్ అన్నాడు. సిరీస్ బ్రాడ్కాస్టర్ సూపర్స్పోర్ట్ను అశ్విన్ టార్గెట్ చేశాడు. మీరు గెలవాలంటే మరో మార్గాన్ని ఎంచుకోవాలని అశ్విన్ ఆ మైక్ వద్ద అన్నాడు. అయితే కేవలం 212 రన్స్ టార్గెట్తో సెకండ్ ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ప్రస్తుతం రెండు వికెట్లకు 101 రన్స్ చేసింది. మరో 111 రన్స్ చేస్తే సిరీస్ దక్షిణాఫ్రికా వశం అవుతుంది.