Durand Cup 2023 : డ్యురాండ్ కప్లో కోల్కతాకు చెందిన ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్(East Bengal FC) ఫ్యాన్స్ రెచ్చిపోయారు. నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్(Northeast United FC) అభిమానులపై ఇటుకలు విసిరేశారు. అంతేకాదు వాళ్లను ఉద్దేశిస్తూ జాతి వివక్ష(Racism) పూరిత వ్యాఖ్యలు చేశారు. ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ సెమీఫైనల్లో విజయం సాధించిన అనంతరం ఈ సంఘటన జరిగింది. చివరి వరకు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ జట్టు పెనాల్టీ షూటౌట్(Penalty Shootout)లో గెలుపొందింది. తమ క్లబ్ గెలవడంతో సంబురాల్లో మునిగి పోయిన ఫ్యాన్స్ ప్రత్యర్థి జట్టు అభిమానులపై దాడికి పాల్పడ్డారు.
ఇటుకులు విసరడమే కాకుండా వాళ్లను జాతి వివక్షపూరిత పదాలతో దూషించారు. దాంతో, అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని గమనించిన పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి నార్త్ ఈస్ట్ క్లబ్ అభిమానులను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు పంపించారు. అంతేకాదు ఆందోళనకు కారణమైన వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే… ఈ మొత్తం వ్యవహారానికి రాజా గుహ(Raja Guha) అనే ఈస్ట్ బెంగాల్ అభిమాని కారణమని తెలుస్తోంది. ఈరోజు రెండో సెమీఫైనల్లో ఎఫ్సీ గోవా(FC Goa), మొహున్ బగన్ సూపర్ జెయింట్(Mohun Bagan Super Giant) జట్లు తలపడనున్నాయి.