Dravid vs Ravi Shastri | టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే భారత జట్టు నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీతో టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీ, జట్టు కోచ్గా రవిశాస్త్రి శకం ముగిసింది. ఈ క్రమంలో తాజాగా న్యూజిల్యాండ్తో జరిగిన టీ20 సిరీస్లో కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్కు అద్భుతమైన ఆరంభం లభించింది. కివీస్ జట్టును భారత జట్టు క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ స్పందించాడు.
కోచ్గా ఉన్న సమయంలో రవిశాస్త్రి చేసిన కొన్ని వ్యాఖ్యలపై గంభీర్ విమర్శలు చేశాడు. విజయాలు చూసి పొంగిపోవడం తగదని, గెలిచిన చోట కూడా వినయంగానే ఉండటం చాలా ముఖ్యమని ఈ మాజీ ఓపెనర్ చెప్పాడు. రవిశాస్త్రి హయాంలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్లను భారత్ గెలుచుకుంది. ఆ తర్వాత ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలో కూడా కొన్ని మరపురాని విజయాలను నమోదు చేసింది.
కానీ ఈ విజయాల తర్వాత రవిశాస్త్రి మాటలే బాగలేవని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ‘మన విజయాల గురించి ఎదుటి వాళ్లు చెప్పుకోవాలి. 2011లో ప్రపంచకప్ గెలిచిన తర్వాత కూడా ఇదే ప్రపంచంలో అత్యుత్తమ జట్టు అని ఎవరూ చెప్పలేదు. ఆ వినయం ఉండాలి‘ అని సూచించాడు.
ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ విజయం తర్వాత రవిశాస్త్రి మాట్లాడుతూ ఇది చాలా గొప్ప విజయమని, 1983 ప్రపంచకప్ గెలుపు కన్నా ఇదే గొప్పదని చెప్పిన సంగతి తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యలు రాహుల్ ద్రవిడ్ ఎప్పటికీ చేయడని గంభీర్ అన్నాడు.
భారత జట్టు సరిగా ఆడినా ఆడకపోయినా, ద్రవిడ్ వ్యాఖ్యలు ఎప్పుడూ సమతూకంగానే ఉంటాయని చెప్పాడు. తనకు తెలిసి ఆటగాళ్లను ముందుగా మంచి మనుషులుగా తీర్చిదిద్దడంపైనే ద్రవిడ్ ఎక్కువ ఫోకస్ పెడతాడని భావిస్తున్నట్లు గంభీర్ పేర్కొన్నాడు.