ప్రతిష్టాత్మక వింబూల్డన్-2022 నేటి (జూన్ 27) నుంచి యూకే వేదికగా ప్రారంభం కానుంది. దిగ్గజ ఆటగాళ్లు పోటీ పడుతున్న ఈ టోర్నీ.. వచ్చే నెల 10 వరకు సాగనుంది. అయితే టెన్నిస్ లో అతి పురాతనమైన ఈ టోర్నీకి భారత క్రికెట్ గతిని మార్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు సంబంధముందన్న విషయం ఎంతమందికి తెలుసు..? అసలు ఐపీఎల్ పుట్టిందే టెన్నిస్ కోర్టు లాంజ్ లో అనే సంగతి ఎవరికైనా తెలుసా..? కానీ అది నిజం. ఐపీఎల్ ఐడియా పుట్టిందే వింబూల్డన్ లో..
అది 2007 నాటి ముచ్చట. ఆ ఏడాది వింబూల్డన్ లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ లో విరామం సందర్భంగా ముగ్గురు వ్యక్తులు కలిసి లాంజ్ లో టీ తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. వారిలో ఒకరు‘నేను భారత క్రికెట్ స్వరూపాన్ని మార్చేయాలనుకుంటున్నాను. అందుకు నా దగ్గర ఓ ఐడియా ఉంది..’ అని ప్రముఖ క్రికెట్ వ్యూహకర్త ఆండ్రూ వైల్డ్ బ్లడ్ తో అన్నాడు. అక్కడే కూర్చున్న మూడో వ్యక్తి అందుకు గాను తనకు తెలిసిన సూచనలు, ఫ్రాంచైజీ క్రికెట్ పై తనకు తెలిసిన విషయాలను పంచుకున్నాడు. అంతే.. క్రికెట్ పండితుల మేథో మథనం తర్వాత ఏడాది తిరిగేలోపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెడీ.
భారత క్రికెట్ స్వరూపాన్ని మారుస్తానన్న ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఈ క్యాష్ రిచ్ లీగ్ సృష్టికర్త లలిత్ మోడీ. అతడు ఈ టోర్నీ ప్రారంభించే సమయానికి బీసీసీఐ ఉపాధ్యక్షుడి (2005 -10)గా కొనసాగుతున్నాడు. 2008 – 10 వరకు లీగ్ చైర్మన్ గా ఉన్న ఆయన తర్వాత దాని నుంచి వైదొలిగాడు. ఈ ముగ్గురి చర్చలలో భాగంగా మోడీకి సలహాలిచ్చిన వ్యక్తి పేరు రిచర్డ్ మ్యాడ్లీ (ఇంగ్లాండ్). ఐపీఎల్ ప్రారంభం నుంచి 2018 వరకు ఈ లీగ్ వేలం నిర్వహించింది ఈయనే. ఐపీఎల్ ఐడియా వింబూల్డన్ లో పుట్టిందని ఆయన ఈ ఏడాది ఐపీఎల్ వేలం సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించాడు.
2008 లో పురుడుపోసుకున్న ఈ టోర్నీ బ్రేకుల్లేకుండా దూసుకెళ్తున్నది. కరోనా సమయంలో ప్రపంచమంతా స్తంభించి అసలు క్రీడలను ఎలా ఆడించాలన్న సమయంలో బయో బబుల్ ద్వారా భారీ లీగ్ ను నిర్వహించింది బీసీసీఐ. ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మీడియా హక్కుల (2023-27 కాలానికి) ద్వారా ఏకంగా రూ. 48,390 కోట్లు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన (విలువ పరంగా) రెండో స్పోర్ట్స్ లీగ్ గా అవతరించి మరింత ఎత్తుకు ఎదుగుతున్నది ఐపీఎల్. ఇదీ వింబూల్డన్ లో పుట్టిన ఐపీఎల్ కథ.