మూడు రోజులుగా ప్రపంచ క్రికెట్ అభిమానులతో పాటు పలు దిగ్గజ క్రీడా లీగ్ నిర్వాహకులలో ఆసక్తి రేపుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మీడియా హక్కుల వేలం ప్రక్రియ కొలిక్కి వచ్చింది. మూడు రోజుల ఉత్కంఠకు తెరదించుతూ హక్కులు ఎవరికీ దక్కాయో ఐపీఎల్ తేల్చింది. గడిచిన ఐదేండ్లుగా ఐపీఎల్ ప్రసారాలను అందిస్తున్న ‘డిస్నీ స్టార్’కే టీవీ హక్కులు దక్కగా.. రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్18 కు డిజిటల్ హక్కులు దక్కాయి.
ఈ మేరకు ఐపీఎల్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘మాతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నందుకు స్టార్ స్పోర్ట్స్ ఇండియాకు ధన్యవాదాలు. వయాకామ్18 తో పాటు టైమ్స్ ఇంటర్నెట్ కు స్వాగతం.. రాబోయే ఐదేండ్ల ప్రయాణానికి ఇది ఆరంభం..’ అని ట్వీట్ చేసింది. బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా ఇందుకు సంబంధించిన వివరాలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
తాజా సమాచారం ప్రకారం.. 2023-27 కాలానాకి గాను నాలుగు ప్యాకేజీలుగా విభజించిన ఐపీఎల్ మీడియా హక్కులలో ఎ(టీవీ ప్రసార హక్కులు) ను దక్కించుకున్న స్టార్ ఇండియా రూ. 23,575 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. డిజిటల్ హక్కుల (బి) కోసం వయాకామ్ రూ. 23,773 కోట్లను చెల్లించనుంది. అయితే డిజిటల్ హక్కులలో వయాకామ్ తో పాటు టైమ్స్ ఇంటర్నెట్ కూడా భాగమైంది. మొత్తంగా నాలుగు ప్యాకేజీల ద్వారా బీసీసీఐకి రూ. 48,390 కోట్ల ఆదాయం చేకూరనుంది.
ప్యాకేజీ ఎ : డిస్నీ స్టార్ – రూ. 23,575 కోట్లు
బి : వయాకామ్ – రూ. 20,500 కోట్లు
సి : వయాకామ్ – రూ. 3,273 కోట్లు