భారత జట్టు మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడినప్పుడు ఆ జట్టులో సభ్యుడతను. ఆ తర్వాత వివిధ కారణాలతో జట్టులోకి వస్తూ పోతూనే ఉన్నాడు. చివరకు ఆశలు వదిలేసుకొని కామెంటేటర్ అవతారమూ ఎత్తాడు. ఈ ఏడాది ఐపీఎల్లో అతని రోల్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్పష్టత ఇవ్వడంతో చెలరేగిపోయాడు.
అంతే ఇప్పుడు టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతనే కర్ణాటక స్టార్ బ్యాటర్ దినేష్ కార్తీక్. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో ఐపీఎల్ పుణ్యమా అని టీమిండియా తలుపు తట్టాడీ వికెట్ కీపర్ బ్యాటర్. 37 ఏళ్ల వయసులో భారత జట్టులో పునరాగమనం చేసి, తొలిసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.
లోయర్ ఆర్డర్లో విలువైన పరుగులు చేస్తున్న అతన్ని టీ20 ప్రపంచకప్లో ఆడించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్లో అదరగొడుతున్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయంపై మాట్లాడిన డీకే.. టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున ఆడటమే తన కోరిక అని చెప్పాడు.
ఇప్పుడు ఆ కల నెరవేరడంతో డీకే ఆనందానికి హద్దులేకుండా పోయింది. టీ20 ప్రపంచకప్ జట్టులో తన పేరు ఉండటంతో ‘కలలు నిజం అవుతాయి’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డీకే క్రికెట్ కెరీర్ ఏదో చందమామ కథలా ఉందంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Dreams do come true 💙
— DK (@DineshKarthik) September 12, 2022