ఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.. 17 ఏండ్ల తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్-17 ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్తో పోరు తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లు అతడికి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇవ్వగా ఈ లీగ్ డిజిటల్ ప్రసారదారు జియో తన ‘ఎక్స్’ ఖాతాలో డీకే రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. మ్యాచ్ ఓడిపోయాక నిరాశగా వెనుదిరుగుతున్న డీకే.. డ్రెస్సింగ్ రూమ్ వైపునకు వెళ్తుండగా ప్రేక్షకులకు అభివాదం చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.
ఐపీఎల్ ఆరంభ ఎడిషన్ (2008) నుంచి బుధవారం నాటి రాజస్థాన్తో మ్యాచ్ దాకా 17 సీజన్ల పాటు ఆరు ఫ్రాంచైజీ (ఢిల్లీ, పంజాబ్, ముంబై, బెంగళూరు, కోల్కతా, గుజరాత్)లకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా ఈ లీగ్లో 257 మ్యాచ్లు ఆడిన కార్తీక్.. 4,842 పరుగులు చేశాడు. ఇందులో 22 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తాజా సీజన్లో 15 మ్యాచ్లు ఆడి 187 స్ట్రైక్ రేట్తో 326 రన్స్ సాధించాడు. జాతీయ జట్టులో ధోనీ నీడన దక్కాల్సిన గుర్తింపు దక్కకపోయినా ఐపీఎల్లో మాత్రం డీకే తనదైన ముద్ర వేశాడు.