టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకడంతో ఇంగ్లండ్తో ఐదో టెస్టులో సారథిగా ఎంపికైన జస్ప్రిత్ బుమ్రా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు కెప్టెన్గా ఎంపిక కాకముందు మహేంద్ర సింగ్ ధోని సైతం ఒక్క మ్యాచ్లో కూడా సారథిగా చేయలేదని గుర్తు చేశాడు. తన మీద తనకు నమ్మకముందని బుమ్రా స్పష్టం చేశాడు.
బుమ్రా మాట్లాడుతూ.. ‘నేను ధోనితో ఆడుతున్నప్పుడు అతడు నాకు చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టకముందు ధోని అంతకుముందెప్పుడూ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించలేదు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో కూడా ధోని కెప్టెన్గా లేదు. కానీ ఇప్పుడు ధోని ఏంటో మనందరికీ తెలుసు. కావున నేను నా ప్రదర్శన జట్టుకు ఎలా ఉపయోగపడుతుందన్నమీదే దృష్టి సారిస్తా. గతంలో నేను ఏం చేశాను..? ఏం సాధించాను అన్నది అప్రస్తుతం…’అని అన్నాడు.
భారత జట్టు తరఫున ఒక్క టెస్టు అయినా ఆడితే చాలనుకున్నానని కానీ ఇప్పుడు ఏకంగా నాయకుడిగా వ్యవహరిస్తుండటంపై బుమ్రా స్పందిస్తూ.. ‘ఇండియాకు టెస్టులలో ఆడాలనేది నా కల. ఇక ఈ అవకాశం (కెప్టెన్) రావడమనేది నా క్రికెట్ కెరీర్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నా మీద నాకు విశ్వాసముంది. నేను పోషించబోయే పాత్రలో ఎలాంటి మార్పు ఉండదు. జట్టు కెప్టెన్గా కూడా నేను అదే చేయబోతున్నాను..’ అని అన్నాడు.
ఇక తాను కెప్టెన్ అయిన విషయాన్ని అందరికంటే ముందు తన కుటుంబానికి చెప్పానని బుమ్రా తెలిపాడు. దానికి వాళ్లు చాలా సంతోషించారని చెప్పాడు. ఈ కీలక టెస్టులో రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు దూరం కావడం దురదృష్టకరమని బుమ్రా తెలిపాడు.