దుబాయ్: దాయాది పాకిస్థాన్తో కీలక పోరుకు ముందు టీమ్ఇండియా నెట్స్లో చెమటోడుస్తున్నది. శుక్రవారం ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్లో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్లో మునిగితేలగా.. మెంటార్ మహేంద్రసింగ్ ధోనీ.. త్రో డౌన్స్ స్పెషలిస్ట్ అవతారమెత్తాడు. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కేవలం బ్యాటింగ్ ప్రాక్టీస్కే పరిమితం కాగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ తన గురువు ధోనీతో చర్చిస్తూ కనిపించాడు. ఇదిలా ఉండగా టీమ్ఇండియాతో పాటు ఉన్న నలుగురు నెట్ బౌలర్లను జట్టు యాజమాన్యం స్వదేశానికి పంపింది. దేశవాళీ టీ20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో కరణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్, వెంకటేశ్ అయ్యర్ను స్వదేశానికి పంపింది. ‘ప్రధాన పోటీలు ప్రారంభమయ్యాక నెట్ సెషన్లకు ఎక్కువ అవకాశం ఉండదు. అందుకే జాతీయ సెలెక్టర్లు నెట్ బౌలర్లను ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం పంపించారు. ఇప్పటికే చాలా మంది స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.