ప్రపంచ మహమ్మారి కరోనా విషయంలో క్రీడాకారులందరికీ ఓ నిబంధన ఉంటే ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టుకు ప్రత్యేక నిబంధనలున్నాయా..? ఏమో మరి, ఆదివారం బర్మింగ్హామ్ వేదికగా ముగిసిన ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ చూశాక ఈ అనుమానం రాకమానదు. కరోనా బారిన పడ్డ క్రీడాకారులు నిబంధనల ప్రకారం వారం రోజుల పాటు క్వారంటైన్లో గడపాలి. నెగిటివ్గా తేలితేనే మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టాలి. కానీ ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆల్ రౌండర్ తహిల మెక్గ్రాత్ విషయంలో మాత్రం ఈ నిబంధనలు మరో విధంగా ఉన్నాయి.
శనివారం న్యూజిలాండ్తో సెమీస్ మ్యాచ్ ముగిశాక మెక్గ్రాత్ కరోనా బారిన పడింది. అయితే ఆమె ఫైనల్ ఆడే జట్టులో సభ్యురాలు కావడంతో ఆస్ట్రేలియా మాత్రం మెక్గ్రాత్ను పక్కనపెట్టలేదు. ఆదివారం ఉదయం నిర్వహించిన కరోనా పరీక్షలో ఆమెకు కరోనా అని తేలింది. తేలికపాటి లక్షణాలతో ఇబ్బందిపడుతున్న మెక్గ్రాత్ నిన్నటి మ్యాచ్ ఆడటం గమనార్హం.
మెక్గ్రాత్ ఆడటానికి ఆస్ట్రేలియా.. యూకే కామన్వెల్త్ నిర్వాహకులతో పాటు యూకే వైద్యాధికారుల పర్మిషన్ తీసుకున్నదని సమాచారం. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసేప్పుడు తన టీమ్ మేట్స్ అంతా ఒకదగ్గరుంటే మెక్గ్రాత్ మరోచోట కూర్చుంది. స్టాండ్స్లో ఉండేప్పుడు ఆమె ముఖానికి మాస్క్ పెట్టుకుని ఉంది. కానీ బ్యాటింగ్ చేసేప్పుడు మాత్రం ఆమె మాస్కును తీసేసిరావడం ఆశ్చర్యం కలిగించింది.
ఈ మ్యాచ్లో బ్యాటింగ్ (2 పరుగులు)తో పాటు ఆమె బౌలింగ్ కూడా చేసింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులిచ్చింది. ఇదిలాఉండగా మెక్గ్రాత్కు కరోనా సోకినా ఆమెను ఆడటానికి అనుమతించినడంపై క్రికెట్ అభిమానులతో పాటు సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.