Ranji Trophy 2024 | జాతీయ జట్టు తరఫున ఆడుతున్నా, సెంట్రల్ కాంట్రాక్టులు ఉన్న ఆటగాళ్లంతా ఫిట్గా ఉండి ఆడగలిగే అవకాశమున్నప్పుడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ (ముఖ్యంగా రంజీలు) ఆడాల్సిందేనని బీసీసీఐ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా పలువురు టీమిండియా క్రికెటర్లు పెడచెవిన పెడుతున్నారు. జాతీయ జట్టులోకి నేరుగా రావడం కుదరదని, ఐపీఎల్లో ఆడాలన్నా, లేదా యాక్షన్లో పాల్గొనాలన్నా రంజీ క్రికెట్ ఆడటం కీలకమని బీసీసీఐ త్వరలోనే కీలక ఆదేశాలు జారీ చేయనున్న నేపథ్యంలో క్రికెటర్లు మాత్రం తమకేమీ సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా టీమిండియాకు ఆడుతూ ప్రస్తుతం జట్టులో లేని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్ వంటి ఆటగాళ్లు రంజీలను మరోసారి రంజీ ట్రోఫీని స్కిప్ చేశారు.
దేశవాళీలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంజీలలో భాగంగా గ్రూప్ దశలో ఆఖరి రౌండ్ మ్యాచ్లు నేటి నుంచి మొదలయ్యాయి. ఈ రౌండ్ మ్యాచ్ల తర్వాత రంజీలలో క్వార్టర్స్ మ్యాచ్లు మొదలవుతాయి. జార్ఖండ్, రాజస్తాన్, ముంబై తరఫున ఆడే ఇషాన్, చాహర్, శ్రేయస్లు మాత్రం ఈ దశ పోటీల నుంచి దూరంగా ఉన్నారు.
దక్షిణాఫ్రికా టూర్లో భాగంగా వన్డే సిరీస్ నుంచి అర్థాంతరంగా భారత్ తిరిగొచ్చిన ఇషాన్.. ప్రస్తుతం హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాతో కలిసి బరోడాలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇంగ్లండ్తో రెండు టెస్టులు ఆడిన శ్రేయస్ అయ్యర్.. ఫామ్ లేమితో జట్టులో చోటు కోల్పోయాడు. ఇక దీపక్ చాహర్ అయితే భారత్కు ఆడక చాలాకాలమైంది. వీళ్లు రంజీలలో ఆడాలని బీసీసీఐ పదే పదే చెబుతున్నా ఈ ప్లేయర్లు మాత్రం బోర్డు ఆదేశాలను పక్కనబెట్టేస్తున్నారు.