ముంబై: వీరోచిత పోరాటం చేసినా.. గెలుపు గీత దాటలేకపోతున్న భారత మహిళల జట్టు మంగళవారం ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే ఆసీస్ 3-1తో చేజిక్కించుకోగా.. నామమాత్ర పోరులో విజయంతో సిరీస్ ముగించాలని హర్మన్ప్రీత్ బృందం చూస్తున్నది. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నామంటున్న మన అమ్మాయిలు ఈ మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. స్మృతి మందన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దేవిక, దీప్తి శర్మతో భారత జట్టు బలంగానే ఉన్నా.. ఈ ఫార్మాట్లో రాటుదేలిన ఆస్ట్రేలియా అమ్మాయిలకు సరైన పోటీనివ్వలేకపోతున్నారు. పేస్ విభాగంలో అనుభవరాహిత్యం మన జట్టును దెబ్బతీస్తున్నది. రేణుక రాణిస్తున్నా.. కంగారూలకు ముకుతాడు వేయాలంటే సమష్టి ప్రదర్శన తప్పనిసరి.